లోన్ వద్దన్నా.. బాధితుడి ఖాతాల్లో రూ.44వేలు డిపాజిట్ చేశారు : ఏసీపీ
లోన్ యాప్ల వేధింపులపై రాచకొండ సైబర్ క్రైమ్కు బాధితుల క్యూ కడుతున్నారు. ఇప్పటివరకు 75 మంది బాధితులు ఫిర్యాదు చేశారు.;
లోన్ యాప్ కేసులో రాచకొండ సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు రూ.29.58 కోట్లు ఫ్రీజ్ చేశారు. లోన్ యాప్ల వేధింపులపై రాచకొండ సైబర్ క్రైమ్కు బాధితుల క్యూ కడుతున్నారు. ఇప్పటివరకు 75 మంది బాధితులు ఫిర్యాదు చేశారు.
పది రోజుల క్రితం ఉప్పల్కు చెందిన భూమన ప్రసాద్.. లోన్ యాప్నుంచి రుణం తీసుకున్నాడు. ఆ తర్వాత వాటిని కట్టేశాడు. కానీ అతను వద్దని చెప్పినా.. మరో 44వేలు అప్పిచ్చాయి లోన్యాప్ సంస్థలు. దీంతో దాదాపు లక్ష రూపాయలకుపైగా వడ్డీ చెల్లించాడు భూమన ప్రసాద్. ఇంకా వడ్డీ కట్టాలంటూ వేధిస్తుండటంతో భూమన ప్రసాద్ రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లోన్ యాప్ కాల్ సెంటర్ పూణెలో ఉన్నట్లు గుర్తించారు. ఈ కాల్ సెంటర్ నిర్వహిస్తున్న పరుశురామ్ లాహూ టక్వే, అతని భార్య లియాంగ్ టియాన్, మేనేజర్ ఎస్కే అకిబ్ను అరెస్ట్ చేశారు. అజయ్ సొల్యూషన్ పేరుతో మొత్తం 14 యాప్ల ద్వారా లోన్లు ఇచ్చి వసూళ్లు చేస్తున్నారు ఈ కాల్ సెంటర్ నిర్వాహకులు. దీనిపై దర్యాప్తు చేయగా.. ఈ సంస్థలో ఇద్దరు చైనాకు చెందిన వారు ఉన్నట్లు తేల్చారు. ఈ సంస్థ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న 29 కోట్లు రూపాయలను ఫ్రీజ్ చేశారు పోలీసులు. మరో నిందితుడు అంకుర్ సింగ్ పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ లభిస్తే అనేక విషయాలు తెలుస్తాయంటున్నారు పోలీసులు.