Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో ఆధారాల సేకరణ
దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో ఆధారాల సేకరణ దిశగా హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందుకోసం సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వివరాలు సేకరించే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది. సాధారణంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు నిరూపించడంలో ఇవే కీలక సాక్ష్యాలు కానుండటంతో వాటిపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాల కోసం దర్యాప్తు బృందం ముమ్మరశోధన చెపట్టింది.
ఎస్ఐబీ కార్యాలయంలో లాగర్ రూమ్స్ నుంచి స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ పేరిటఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారో తెలుసుకునేందుకు ఇప్పటికే మూసీ నది నుంచి సేకరించిన హార్డ్ డిస్క్లను రిట్రీవ్ చేసే పనిలో ఉన్నారు. దీంతోపాటు ఎవరెవరిని లక్ష్యంగా చేసుకొని ఫోన్లు ట్యాప్ చేశారనే ప్రాథమిక సమాచారాన్ని... సేకరించేందుకు ఇది వరకు ఎస్ఐబీ, టాస్క్ ఫోర్స్లో పనిచేసిన వారితోపాటు మొత్తం 34 మంది నుంచి వాంగ్మూలాలు సేకరించారు. వీటి ఆధారంగా సర్వీస్ ప్రొవైడర్ల నుంచి సమాచారం రాబట్టనున్నారు. ఓ ప్రముఖ టెలీకమ్యూనికేషన్ సర్వీస్ కంపెనీకి చెందిన ఉద్యోగిని మచ్చిక చేసుకున్న ప్రణీత బృందం... అతడి సహకారంతో విచ్చలవిడిగా ట్యాపింగ్కు పాల్పడినట్లు దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో అతడిని విచారించడం ద్వారా... ట్యాపింగ్ కుట్రకు సంబంధించి కీలక సమాచారం సేకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి స్పష్టమైన ఆధారాలు లభించిన తర్వాతే... ఈ కేసులో ఇండియన్ టెలీగ్రాఫ్ యాక్ట్ను చేర్చుతూ న్యాయస్థానంలో మెమో దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నల్గొండ పోలీసులు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావుతో కలిసి పనిచేసిన పలువురు క్షేత్రస్థాయి అధికారులను, సిబ్బందిని విచారించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎస్ఐబీ, వరంగల్, నల్గొండ జిల్లాల్లో పనిచేసిన పలువురు పోలీసులను విచారించిన దర్యాప్తు బృందం .. నల్గొండ జిల్లాలో పనిచేస్తున్న కొందరిని పిలిచి విచారించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మునుగోడు సహా.. జరిగిన పలు ఉపఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ఆరోపణల కోణంలో.. వీరిని ప్రశ్నించి వివరాలు రాబట్టినట్లు సమాచారం. వీరి విచారణ పూర్తయిన అనంతరం అప్పటి ఎన్నికల సమయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పనిచేసిన ఒకరిద్దరు ఉన్నతాధికారులకు... నోటీసులు జారీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రోజు రోజుకూ కొత్త మలుపులు తిరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు... రాష్ట్ర వ్యాప్తంగా సంచనలంగా మారింది. ఎప్పుడు ఎవ్వరికి నోటీసులు వెళ్తాయోనని ఉత్కంఠ నెలకొంది.