HYD: నాలుగు రోజులైనా కానరాని నిందితుల జాడ

అఫ్జల్‌ గంజ్ కాల్పుల కేసు నిందితుల కోసం పోలీసుల ముమ్మర గాలింపు;

Update: 2025-01-20 04:00 GMT

అఫ్జల్‌ గంజ్ కాల్పుల ఘటనకు పాల్పడిన నిందితులు నాలుగు రాష్ట్రాల పోలీసులకు సవాల్ విసురుతున్నారు. నాలుగు రోజుల క్రితం కర్ణాటక రాష్ట్రం బీదర్‌లో ఏటీఎంలో నగదు పెట్టేందుకు రూ.93 లక్షలు తీసుకెళ్తున్న వాహనంపై కొంతమంది దుండగులు కాల్పులు జరిపారు. అనంతరం నగదు తీసుకుని హైదరాబాద్ చేరుకున్నారు. అఫ్జల్‌గంజ్‌లో బీదర్ పోలీసులు వారిని గుర్తించడంతో తప్పించుకునేందుకు నిందితులు ఓ ట్రావెల్ కంపెనీలోకి చొరబడ్డారు. అక్కడ పోలీసులపైకి కాల్పులు జరిపారు. ఆ తర్వాత పోలీసుల కళ్లుగప్పి పరారయ్యారు. ఈ కాల్పుల్లో ట్రావెల్ కంపెనీ మేనేజర్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆయన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కానరాని నిందితుల జాడ

ఘటన జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా నిందితుల జాడ మాత్రం తెలియడం లేదు. బీహార్, ఛత్తీస్‌ఘడ్, కర్ణాటకలోనూ ఈ ముఠా దోపిడీలు, దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగల ఆచూకీ కోసం నాలుగు రాష్ట్రాల పోలీసులు జల్లెడ పడుతున్నారు. వీరి కోసం బీహార్, ఛత్తీస్‌గఢ్‌, రాయ్‌పూర్‌‌ ప్రాంతాల్లోనూ ఎనిమిది ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే నిందితుల కోసం హైదరాబాద్ ట్రై కమిషనరేట్ల పరిధిలో 500 సీసీ కెమెరాలు పరిశీలించారు. ఓ ప్రాంతంలో దుండగులు తిరుగుతున్నట్లు సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. ఈ ముఠా సభ్యులు ఎవ్వరూ ఫోన్ వాడకుండా జాగ్రత్త పడుతున్నారు. దీంతో వారి ఆచూకీ గుర్తించడం కష్టంగా మారిందని పోలీసులు చెబుతున్నారు. నిందితులంతా ఇంకా హైదరాబాద్‌లోనే ఉన్నట్లు తెలిపారు. పూటకో డ్రెస్ మారుస్తూ ఆటోల్లో తిరుగూ తప్పించుకుంటున్నారని వెల్లడించారు. త్వరలోనే వారందరినీ పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

Tags:    

Similar News