MODI: నూతన ఎమ్మెల్సీలకు మోదీ శుభాకాంక్షలు
బీజేపీ శ్రేణులను చూసి గర్విస్తున్నానన్న ప్రధాని;
తెలుగు రాష్ట్రాల్లో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణకు చెందిన మల్క కొమరయ్య, అంజిరెడ్డికి అభినందనలు చెప్పారు. " ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి అద్భుతమైన మద్దతు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కొత్తగా ఎన్నికైన మా అభ్యర్థులకు అభినందనలు. తెలంగాణ ప్రజల మధ్య ఎంతో శ్రద్ధతో పనిచేస్తున్న మా పార్టీ కార్యకర్తలను చూసి నేను చాలా గర్వపడుతున్నాను." అని రాసుకొచ్చారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో మల్క కొమురయ్య భారీ మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలవగా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో రెండో ప్రాధాన్యత ఓట్లతో అంజిరెడ్డి విజయం సాధించారు.
హాట్ టాపిక్గా బీజేపీ
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక టీచర్, మరో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ విజయాలు హాట్ టాపిక్గా మారాయి. తాజా రెండు ఎమ్మెల్సీలతో తెలంగాణ నుంచి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన బీజేపీ అభ్యర్థుల సంఖ్య 21కి చేరుకుంది. ఇందులో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు , 8 మంది ఎంపీలు, ఇద్దరు రాజ్యసభ ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై భారీ ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.