తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న కేసు కొట్టివేయాలని పిటిషన్లో కోరారు. భద్రాద్రి కొత్తగూడెంలో కాంగ్రెస్ నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం దావా వేశారు. రేవంత్ ప్రసంగం బీజేపీకి పరువు నష్టం కలిగేలా ఉందని కాసం పిటిషన్ దాఖలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారంటూ కాసం పిటీషన్లో పేర్కొని , రేవంత్ రెడ్డి ప్రసంగం ఆడియో, వీడియో క్లిప్పింగ్లను కోర్టుకు సమర్పించారు. దీన్ని ప్రజాప్రతినిధుల కోర్టు విచారణకు స్వీకరించి సాక్షుల వాంగ్మూలం నమోదు చేసింది. దీంతో విచారణలో ఉన్న ఈ కేసును కొట్టేయాలని సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించి కేసు విచారణ చేపట్టవద్దని, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అలాగే కోర్టు హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని పిటిషన్లో సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. కోర్టు విచారణపై ఉత్కంఠ నెలకొంది.