TG High Court: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక తీర్పు
అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశం..;
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. అప్పటిలోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటో కేసుగా విచారిస్తామని పేర్కొంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. భారాస, భాజపా నేతలు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. పార్టీ మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై వేటు వేయాలని భారాస నేతలు పాడి కౌశిక్రెడ్డి, వివేకానందగౌడ్ పిటిషన్ వేశారు. దానంపై అనర్హత వేటు వేయాలని భాజపా ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. వీటన్నింటిని కలిపి హైకోర్టు విచారించగా.. సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను స్పీకర్ పట్టించుకోవడం లేదంటూ పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను ఆదేశించాలని బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావులపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ కార్యాలయంలో పిటీషన్ ఇచ్చినా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు తీర్పుపై స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.