AP: ఆరుగురి హత్య కేసుల్లో విస్తుపోయే నిజాలు

ప్రధాన నిందితుడు సహా అయిదుగురి అరెస్ట్‌... ఆస్తి కాజేయాలన్న కుట్రతో వరుస హత్యలు;

Update: 2023-12-20 02:00 GMT

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఆరుగురి హత్యల కేసులో ప్రధాన నిందితుడు ప్రశాంత్, అతని తల్లి వడ్డెమ్మతో పాటు గూగులోతు విష్ణు, వంశీ సహ మరో మైనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లిలో జరిగిన హత్య ఆధారంగా నమోదైన కేసులో కూపీ లాగడంతో ఆరు హత్యల విషయం వెలుగుచూసింది. ఈ కేసును సవాల్‌గా తీసుకుని ఐదు రోజుల్లోనే కేసును ఛేదించి... నిందితులను అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధుశర్మ వెల్లడించారు. స్నేహితుడిని రాళ్లు, కర్రలతో కొట్టి చంపాడని.. అతడి కుటుంబ సభ్యుల్ని అత్యంత పాశవికంగా హత్య చేశాడని ఎస్పీ వెల్లడించారు. ముగ్గురిని తాడుతో ఉరేసి చంపగా... ఇద్దరు పిల్లల్ని గొంతు నులిమి ఊపిరి తీశాడన్నారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన కామారెడ్డి పోలీసులు... వరుస హత్యలపై విస్తుగొలిపే విషయాలను వెల్లడించారు.


నిజామాబాద్ జిల్లా మాక్లూరుకు చెందిన ప్రసాద్‌పై 2018లో ఒక అమ్మాయి ఆత్మహత్య విషయంలో కేసు నమోదైంది. ఆ తర్వాత ప్రసాద్ దుబాయ్ వెళ్లిపోయాడు. దుబాయి నుంచి వచ్చిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రసాద్ కుటుంబం గ్రామ బహిష్కరణకు గురైంది. ప్రసాద్‌ తన ఊరును విడిచి.. కుటుంబంతో కలిసి కామారెడ్డి జిల్లా పాల్వంచకు వచ్చి నివాసం ఉంటున్నాడు. జైలుకు వెళ్లడం, అప్పుల కారణంగా ఆదాయం లేకపోవడంతో ప్రసాద్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ప్రశాంత్‌ దగ్గర మూడున్నర లక్షల అప్పు తీసుకున్నాడు. ఇదే అదనుగా భావించిన ప్రధాన నిందితుడు... ఆస్తి మొత్తం కాజేయాలని కుట్ర పన్ని... ఈ దారుణాలకు ఒడిగట్టాడని ఎస్పీ సింధుశర్మ వివరించారు.


నవంబర్‌ 29న మాక్లూర్ మండలం మదనపల్లి వద్ద అటవీ ప్రాంతంలోకి ప్రసాద్‌ను తీసుకెళ్లిన ప్రశాంత్‌... మద్యం తాగించాడు. వంశీ, విష్ణులతో కలిసి రాళ్లు, కర్రలతో కొట్టి హత్య చేశారు. మదనపల్లి అటవీ ప్రాంతంలోనే ప్రసాద్‌ను పూడ్చి పెట్టారు. ఆ తర్వాత ప్రసాద్‌ భార్య శాన్విక, చెల్లెళ్లు శ్రావణి, స్వప్న... పిల్లలు చైత్రిక, చైత్రిక్‌ను చంపేశాడు. ఇందులో శాన్విక, శ్రావణి, స్వప్నను తాడుతో ఉరేసి హత్య చేయగా... పిల్లలు చైత్రిక, చైత్రిక్‌ను తన మైనర్‌ తమ్ముడితో కలిసి గొంతు నులిమి ఊపిరి తీశాడు. నిజామాబాద్‌ లాడ్జ్‌లో ఉన్న ప్రసాద్‌ తల్లి సుశీలను చంపేస్తే ఇక అడ్డు ఉందని భావించారు. ఐతే సుశీల.. వారి వద్ద నుండి తప్పించుకుని వెళ్ళిపోయింది. పాల్వంచలో సుశీల ఉండవచ్చని భావించిన ప్రశాంత్, అతడి అమ్మ వడ్డెమ్మ, మైనర్‌ తమ్ముడు సహా నిందితులు వంశీ, విష్ణు... కారులో ఆ ఊరికి బయల్దేరారు. గాంధారి ఎక్స్ రోడ్డులో వారిని పొలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదాశివనగర్‌లో నమోదైన హత్య ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. సాంకేతికత ఆధారంగా కేసును ఛేదించారు. ఇప్పటికే నాలుగు మృతదేహాలను గుర్తించగా.. ప్రసాద్, అతని భార్య శాన్విక మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉంది.

Tags:    

Similar News