Fake Seeds: నకిలీ విత్తనాలు అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్‌ బృందాలు

రైతులను మోసం చేసే విత్తన విక్రయదారులపై కఠిన చర్యలు;

Update: 2024-05-30 00:45 GMT

 రోహిణి కార్తె ప్రారంభం కావడంతో పలు చోట్ల విత్తన దుకాణాల్లో రైతులతో కిటకిటలాడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు దుక్కి దున్నుకుని.. విత్తనాల సమీకరణలో నిమగ్నమయ్యారు. ఇదే అదునుగా భావించి వ్యాపారులు నకిలీ విత్తనాలతో రైతులను మోసపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కృత్రిమ కొరత సృష్టిస్తుండడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు ముమ్మరం చేశారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైతులు వానాకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు చోట్ల వర్షాలు కురవగా.. నైరుతి రుతుపవనాలు నాలుగైదు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. దీంతో అన్నదాతలు విత్తనాల కొనుగోళ్లపై దృష్టి సారించారు. అధిక దిగుబడుల కోసం సమయం దాటకముందే విత్తనాలు కొనేందుకు దూకాణాల ముందు బారులు తీరారు. దీంతో జిల్లాలోని విత్తన దుకాణాలన్నీ రైతులతో కిటికటలాడుతున్నాయి. 

ఉమ్మడి జిల్లాలో పత్తి, వరి, మిరప, మొక్కజొన్న పంటలను వేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. వ్యాపారులు పలు కంపెనీలకు చెందిన వివిధ రకాల విత్తనాలను అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం మార్కెట్‌‌లో పత్తి ధర అధికంగా ఉండటంతో.. వాతావరణం అనుకూలిస్తుందన్న ఆశతో ఎక్కువ మంది రైతులు పత్తిని సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. గతేడాది వాతావరణ మార్పులవల్ల దిగుబడి తగ్గిందని రైతులు చెబుతున్నా.. ఈ సారైనా కాలం కలిసి వచ్చి అధిక లాభాలు రావాలని కోరుకుంటున్నారు. గతంతో పోలిస్తే ఈ సారి ధరలు అమాంతం పెంచారని రైతులు వాపోతున్నారు. రాబడి కన్నా పెట్టుబడులే ఎక్కువైతున్నాయని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు రైతులు ఒకే రకమైన విత్తనాలు కాకుండా వివిధ రకాల విత్తనాలు కొనుగోలు చేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.

రైతుల అవసరాలను తెలుసుకుని నకిలీ విత్తనాల విక్రయదారులు విజృంభిస్తున్నారు. కొందరు దుకాణదారులు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. వీరిపై వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల కొరడా ఝలిపిస్తున్నారు. తనిఖీల్లో విత్తన, ఎరువుల దుకాణాల యజమానులను అదుపులోకి తీసుకుని.. వారి నుంచి అధిక ధరలకు అమ్మడానికి సిద్ధంగా ఉంచిన పత్తి విత్తన సంచులను స్వాధీనం చేసుకున్నారు. కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరలకు అమ్మి, అమాయకరైతులను మోసం చేసే విత్తన విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషన్ హెచ్చరించారు.

Tags:    

Similar News