రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ శాసన మండలి సమావేశాలు రేపటినుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సమీక్ష.;
తెలంగాణ అసెంబ్లీ శాసన మండలి సమావేశాలు రేపటినుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. గత సమావేశాల మాదిరిగానే.. సభ సజావుగా సాగేందుకు అధికారులు సహకారం అందించాలని సూచించారు. గౌరవ సభ్యులు అడిగిన సమాచారం సాధ్యమైనంత త్వరగా అందిచాలన్నారు. ఆయా శాఖల తరఫున ప్రత్యేక నోడల్ అధికారులను సభలోని బాక్స్లో ఉంచాలని తెలిపారు. అధికారులు కరోనా నిబంధనలను అమలు చేయడంతో పాటు పటిష్టమైన చర్యలను తీసుకోవాలని స్పీకర్ పేర్కొన్నారు.
కరోనా కట్టడికి కృషిచేసిన ప్రభుత్వానికి, వైద్యధికారులకు, సిబ్బందికి స్పీకర్ పోచారం ప్రత్యేక అభినందనలు తెలిపారు. కరోనా లాంటి సంక్షోభ పరిస్థితుల్లోనూ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గత ఏడు అసెంబ్లీ సమావేశాలు ప్రశాంతంగా జరిగాయని.. ఈసారి కూడా అదే విధంగా జరగడానికి పోలీస్ శాఖ సహాయ, సహకారం అందించాలని తెలిపారు. ఇతర రాష్ట్రాల శాసన సభలతో పోల్చుకుంటే రాష్ట్ర సమావేశాలు సమర్థవంతంగా జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. సభలు సజావుగా సాగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి స్వీకర్ పోచారం ధన్యవాదాలు తెలిపారు.