BRS: నిరసనలతో కదంతొక్కిన గులాబీ శ్రేణులు
MLC కవిత అరెస్టును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనబాట...;
కవిత అరెస్టుకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా గులాబీశ్రేణులు ఆందోళనబాట పట్టారు. హైదరాబాద్తో పాటు జిల్లాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. పలుచోట్ల రహదారులపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో చేశారు. MLC కవిత అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకి దిగారు. హైదరాబాద్, సికింద్రాబాద్లో పలుచోట్ల నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. అంబర్పేట, మేడ్చల్, మియాపూర్, జూబ్లీహిల్స్లో రోడ్డుపై బైఠాయించి...కేంద్రప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వికారాబాద్ జిల్లాలో రోడ్డుపైకి వచ్చి కేంద్రం, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. కుత్బుల్లాపూర్ షాపూర్నగర్లో GHMCకార్పోరేటర్లు, డివిజన్ అధ్యక్షులు,మున్సిపాలిటీ కౌన్సిలర్లు, మహిళ నాయకులు పెద్దఎత్తున రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారాస శ్రేణులు ఆందోళనబాట పట్టారు. మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో భారీ ర్యాలీచేపట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ద్విచక్రవాహన ర్యాలీచేసి రాస్తారోకో నిర్వహించారు. నిజామాబాద్ NTRధర్నా చౌక్లో బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా శ్రేణులు ఆందోళనకు దిగారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తా వద్ద మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బైఠాయించి నల్ల జెండాలతో నిరసన చేపట్టారు. ఉమ్మడి వరంగల్, మహబూబ్నగర్, హన్మకొండ జయశంకర్ భూపాలపల్లి ,జనగామ జిల్లాల్లో నల్లబ్యాడ్జిలతో రాస్తారోకో నిర్వహించారు .కామారెడ్డిలో కార్యకర్తలతో కలిసి మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ నిరసనకు దిగారు.
ఉమ్మడి మెదక్జిల్లాలో గులాబీ శ్రేణులు నల్లజెండాలతో ధర్నా చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో కేంద్రానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో రోడ్డుపై రాస్తారోకో చేపట్టగా......... సిద్దిపేట జిల్లా గజ్వేల్లో భాజపా, EDకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో గులాబీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ MLC కల్వకుంట్ల కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. రాత్రి ED కార్యాలయంలోని ప్రత్యేక సెల్లో ఉంచిన అధికారులు ఉదయం వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చి తదుపరి విచారణ కోసం పదిరోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. అనంతరం కవిత తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీని ED ఉల్లంఘించి అరెస్టు చేసిందన్నారు. కవితకు సమన్లు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామన్న ఆయన...... గతేడాది సెప్టెంబర్ 15న ఈడీ తరపున సమన్లు ఇవ్వబోమని..., అరెస్ట్ చేయబోమని సుప్రీంకోర్టుకు చెప్పారని గుర్తుచేశారు. సెప్టెంబర్ 26న మరోసారి వాదనలు జరిగినప్పటికీ ED న్యాయవాదులే వాయిదాలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఈ కేసును కొట్టేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసామన్న ఆయన....అక్కడ విచారణ జరుగుతుండగానే కవితను అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికితెచ్చారు.