TG: మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు..?

తెలంగాణ మంత్రివర్గంలో ఆరు ఖాళీలు.. భారీగా ఆశావహులు;

Update: 2024-11-09 04:30 GMT

తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతోంది. ఇప్పటివరకూ ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవుల్ని భర్తీ చేయలేదు. మంత్రి పదవుల భర్తీ కోసం ఆశావహులంతా ఎదురు చూస్తున్నారు. కానీ పదవులు మాత్రం ఎవరికీ ఇవ్వడం లేదు. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చామని కొన్ని పదవులు దక్కుతాయన్న ఆనందం చాలా మంది నేతలకు కలగడం లేదు. ఇప్పటికి పది సార్లకుపైగా కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఇక విస్తరించడమే మిగిలి ఉందని ప్రచారం జరిగింది. కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల దీపావళి తర్వాత కేబినెట్‌ను విస్తరిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు దీపావళి కూడా ముగిసింది. ఆశావహులంతా తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు.

ఢిల్లీకి చక్కర్లు కొట్టినా..

మంత్రివర్గ విస్తరణ పని మీద రేవంత్ రెడ్డి ఇప్పటికి ఓ పది సార్లు ఢిల్లీ వెళ్లి ఉంటారు. ఆయన కూడా వెళ్లడం మానేశారు . తాను చెప్పాల్సినదంతా చెప్పి.. ఇవ్వాల్సిన పేర్లను జాబితా రూపంలో ఇచ్చేసి ఆయన తన భారం దించేసుకున్నారు . ఇక అధికారికంగా పేర్లను పంపి ప్రమాణ స్వీకారానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన బాధ్యత హైకమాండ్ పై ఉంది.కానీ హైకమాండ్ అసలు పట్టించుకోవడంలేదు. దీపావళి తర్వాత మంత్రివర్గ విస్తరణ చేయాలని అనుకున్న రేవంత్‌కు ఇప్పుడా అవకాశం లేకుండా పోతోంది. మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నందున ఇప్పుడు హైకమాండ్ చాలా బిజీగా ఉంటుందని అంటోంది. మంత్రి వర్గ విస్తరణచేస్తే..దాని సైడ్ ఎఫెక్టులు ఉంటాయని ఎన్నికల సమయంలో అది చిరాకుగా మారుతుందని అందుకే..మహారాష్ట్ర ఎన్నికలు అయ్యే వరకూ పరిస్థితి మారదని అంటున్నారు. అంటే.. ఇదిగో..అదిగో అంటూ వాయిదా పడుతూ వస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. మరో నెల రోజుల తర్వాత అనుకోవచ్చు. ఆ తర్వాత ఉంటుందా అంటే…. మరో కారణంతో వాయిదా కోసం వెయిట్ చేసేవరకూ ఆశలు పెట్టుకోవచ్చు.

పోటీ వల్లేనా..

మంత్రి పదవులపై ఆశావహులు చాలా ఎక్కవగా ఉండటంతో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. గత డిసెంబర్‌లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆరు ఖాళీలను భర్తీ చేయాలని అనుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్నన్ని సీట్లు సంపాదించుకోలేకపోయారు. గతం కన్నా ఎక్కువ సీట్లే సాధించుకున్నా ఎనిమిది స్థానాలకే పరిమితమయ్యారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి ప్రాధాన్యతను పెంచవద్దని ఆయన చెప్పిన వారికి కాకుండా ఇతరులకు మంత్రి పదవులు ఇవ్వాలని  పలువురు సీనియర్ నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారని అందుకే గ్రీన్ సిగ్నల్ రాలేదని చెబుతున్నారు. ప్రస్తుతం పన్నెండు మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. ఆరు ఖాళీలు ఉండటం వల్ల ప్రభుత్వ పనితీరుపై ప్రభావం పడుతోంది. హోంశాఖ, విద్యాశాఖ వంటి వాటికి మంత్రులు లేకపోవడంతో వస్తున్న సమస్యలను అధిగమించడానికైనా త్వరగా పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని రేవంత్ కోరుతున్నారు. అయితే వివిద రకాల సమీకరణాలు కలసి రాకపోవడం వల్ల హైకమాండ్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

Tags:    

Similar News