Telangana: ఫామ్ హౌస్ కేసు.. విచారణ వాయిదా..
Telangana: ఫామ్ హౌజ్ ప్రలోభాల కేసులో విచారణ వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.;
Telangana: ఫామ్ హౌజ్ ప్రలోభాల కేసులో విచారణ వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎస్.సంతోష్కు మరోసారి కొత్తగా నోటీసులు ఇవ్వాలని న్యాయమూర్తి సిట్కు సూచించారు.
సంతోష్ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారని, ఎన్నికల తరువాతే నోటీసులు ఇవ్వాలని బీజేపీ కోరింది. దీనిపై స్పందించిన న్యాయమూర్తి ఈమెయిల్, వాట్సప్ల ద్వారా కొత్త గా నోటీసులు పంపించాలని న్యాయమూర్తి సిట్ను ఆదేశించారు.
మరోవైపు సంతోష్కు నోటీసులు ఇవ్వడానికి సిట్ గత కొన్ని రోజులుగా ప్రయత్నిస్తోంది. అయితే ఆయన ఇంతవరకు అందుబాటులోకి రాక పోవడంతో ఆయన వ్యక్తిగత సిబ్బందికి నోటిసులు అందజేసింది సిట్.. అయితే సంతోష్పై అనేక అనుమానాలున్నాయని.. విచారణకు రాకుండా జాప్యం చేయడంతో సాక్ష్యాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని ఏజీ ధర్మాసననానికి తెలిపారు.
అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ తరఫు లాయర్ రామచంద్రరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఆధారాలు మొత్తం బయటపెట్టిందని ఆరోపించారు. బీఎల్ సంతోష్ సీనియర్ సిటిజన్ అని.. ఏం చేయలన్నదానిపై న్యాయసలహా తీసుకుంటున్నారని తెలిపారు.
ఇక సంతోష్ ఎప్పుడు విచారణకు హాజరవుతారన్నదానిపై తమకు సమాచారం లేదని బీజేపీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇంకా వ్యక్తిగతంగా ఆయనకు నోటీసులు అందలేదని చెప్పడంపై ఏజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. నోటీసుల విషయం తెలియనప్పుడు 70 ఏళ్ల వయసులో
విచారణకు హాజరుకా లేనని సిట్కు సంతోష్ ఎలా లేఖ రాశారని ప్రశ్నించారు. బీజేపీ, ప్రభుత్వ న్యాయవాదుల తీరుపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీల ప్రతినిధుల్లా మాట్లాడకూడదని.. రాజకీయ నాయకుల్లా వాదించుకోవడం సరికాదన్నారు.
మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి హైదరాబాద్ సీపీ సీవీ.ఆనంద్తో సహా పలువురితో కలిపి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే ఈ కేసులో సిట్ ఏర్పాటు చేయడం సరైందేనా. లేక హైకోర్టు ప్రత్యేక బృందాన్ని నియమిస్తుందా లేక సీబీఐకి కేసు అప్పగిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
హైకోర్ట్లో జరిగిన విచారణ అంతా సంతోష్ చుట్టూనే తిరుగుతుంది. ఈ విచారణకు సంతోష్ గానీ, అతని తరఫు న్యాయవాది గానీ హాజరు కాలేదు. ఎలాగైనా సంతోష్ను విచారణకు రప్పించాలని సిట్ ప్రయత్నిస్తోంది. అయితే దీనిపై ఈనెల 30న హైకోర్టు ఇచ్చే ఆదేశాలపై సంతోష్ హాజరు ఆధారపడి ఉంటుంది.
మరోవైపు సిట్ దూకుడు పెంచింది. ఈ కేసుతో సంబంధం ఉందన్నట్టుగా భావిస్తున్న మరో ఇద్దరికి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన నందకుమార్ భార్య చిత్రలేఖ, అంబర్ పేటకు చెందిన న్యాయవాది ప్రతాప్ గౌడ్ కు నోటీసులు ఇచ్చింది.