Telangana: తెలంగాణలో మరో 8 మెడికల్ కాలేజీలు.. రూ.14 వందల కోట్ల ఖర్చుతో..
Telangana: తెలంగాణలోని మరో 8 జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.;
Telangana: తెలంగాణలోని మరో 8 జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెడికల్ కాలేజీల ఏర్పాటు, అనుబంధ దవాఖానల అప్గ్రేడేషన్ కు పరిపాలన అనుమతులు జారీ చేసింది. కొత్తగా రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలతోపాటు కుమ్రంభీం ఆసిఫాబాద్, జనగాం జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ఈ 8 మెడికల్ కాలేజీలను 14 వందల 79 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలివిడతలో ప్రభుత్వం 4 కొత్త వైద్య కళాశాలలను మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేటలో ప్రారంభించింది. వీటిలో సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రావడంతో పాటు, వైద్య విద్యా బోధన జరుగుతోంది. రెండో విడుతగా మరో 8 వైద్య కళాశాలలను మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డిలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిల్లో ఈ అకాడమిక్ ఈయర్ నుంచే అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి.
తాజాగా మూడో విడుత ప్రస్తుతం 8 జిల్లాల్లో నూతన మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. కాలేజీ భవనాల నిర్మాణాలను ఆర్ అండ్ బీ శాఖకు అప్పగించిన సర్కార్.. హాస్పిటల్ భవనాల అప్గ్రేడింగ్, పరికరాలు, ఫర్నిచర్ కొనుగోలు బాధ్యతలను TSMSIDCకి అప్పగించారు. ఆయా మెడికల్ కాలేజీలకు అటాచ్ చేస్తున్న హాస్పిటల్స్ను వైద్యవిధాన పరిషత్తు పరిధి నుంచి డీఎంఈ పరిధిలోకి బదిలీ చేశారు.