TELANGANA: కొత్త ఏడాదిలో తెలంగాణలో కొత్త ఎయిర్పోర్ట్
తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త... మామునూరు ఎయిర్పోర్ట్కు మందడుగు... తెలంగాణలో మరో ఎయిర్పోర్ట్... జనవరిలో ఎయిర్పోర్ట్కు భూమి పూజ
తెలంగాణ విమానయాన రంగంలో మరో కీలక అధ్యాయం ప్రారంభం కానుంది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన శంషాబాద్ ఎయిర్పోర్ట్తో పాటు, పరిమిత సేవలతో కొనసాగుతున్న బేగంపేట ఎయిర్పోర్ట్లు రాష్ట్రానికి విమాన రవాణా అవసరాలను తీర్చుతున్నాయి. అయితే ఉత్తర తెలంగాణ ప్రజల దీర్ఘకాలిక కల త్వరలో సాకారం కానుంది. రాష్ట్రంలో మూడవ ఎయిర్పోర్ట్గా అభివృద్ధి కానున్న వరంగల్ విమానాశ్రయం నిర్మాణానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే జనవరిలో ఈ కీలక ప్రాజెక్టుకు భూమి పూజ నిర్వహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని సమాచారం. వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్కు మందడుగు పడనుంది. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తవ్వగా.. రైతులకు కూడా ప్రభుత్వం పరిహారం చెల్లించింది. దీంతో న్యాయపరమైన ఇబ్బందులు కూడా పూర్తయ్యాయి.
త్వరలోనే భూమి పూజ
త్వరలో భూమిపూజకు రంగం సిద్దమైంది. జనవరిలో ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారని సమాచారం. 2027 చివరి నాటికి ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అత్యాధునిక హంగులతో వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ను నిర్మించాలని అనుకుంటోంది. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఎయిర్పోర్ట్ నిర్మించాలనే ఉద్దేశంతో ఇక్కడ నిర్మిస్తోంది. వరంగల్ మామూనూరు ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం ఇప్పపటికే భూసేకరణ ప్రక్రియ పూర్తయింది. గతంలో 696.14 ఎకరాలను సేకరించగా.. ఇటీవల 253 ఎకరాలను సేకరించారు. మొత్తం 950 ఎకరాలను ఎయిర్పోర్ట్ అథారిటీకి ప్రభుత్వం అప్పగించింది. రైతులకు ఎకరానికి రూ.1.20 కోట్ల చొప్పును పరిహారం అందించింది. ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా భూములను ఎయిర్పోర్ట్ కోసం ప్రభుత్వం సేకరించింది. శనివారం భారత విమానయాన సంస్థ హైదరాబాద్ మేనేజర్ బి.వి రావు ఎయిర్పోర్ట్ ప్రాంతాన్ని పరిశీలించారు. వరంగల్లో ఐటీ పార్క్, కాకతీయ టెక్స్టైల్ పార్క్ లాంటి పెద్ద సంస్థలు ఉంటాయి. ఎయిర్పోర్ట్ రాకతో ఉత్తర తెలంగాణ మరింతగా అభివృద్ది చెందనుంది. దీని వల్ల పెట్టుబడులు మరింతగా పెరిగి వరంగల్ జిల్లాలు మరింతగా అభివృద్ది చెందే అవకాశముంది.
కీలక అడుగు
హైదరాబాద్ కేంద్రంగా శంషాబాద్లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే అగ్రశ్రేణి విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచింది. అంతర్జాతీయ, దేశీయ విమానాలతో పాటు కార్గో రవాణాలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తోంది. మరోవైపు బేగంపేట విమానాశ్రయం ప్రస్తుతం వీఐపీ ప్రయాణాలు, శిక్షణ విమానాలు, ప్రత్యేక చార్టర్ సేవలకు మాత్రమే పరిమితమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు దూరంగా ఉన్న ప్రాంతాల ప్రజలకు విమాన సౌకర్యాలు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎయిర్పోర్ట్ ప్రాజెక్టును ముందుకు తీసుకువచ్చింది. చారిత్రక నగరం వరంగల్కు విమానాశ్రయం రావాలన్న డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. ఒకప్పుడు మామునూర్లో ఉన్న పాత ఎయిర్స్ట్రిప్ను ఆధునిక విమానాశ్రయంగా అభివృద్ధి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యిందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. సుమారు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎయిర్పోర్ట్ను నిర్మించనున్నారు. వరంగల్లో అనేక చారిత్రాత్మక దేవాలయాలు ఉన్నాయి. రామప్ప దేవాలయం ఇప్పటికే యునెక్కో గుర్తింపు సంపాదించింది. ఇక వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట వంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఎయిర్పోర్ట్ రాకతో పర్యాటకుల సంఖ్య మరింత పెరగనుంది. దీంతో ఈ ప్రదేశాలకు మరింత గుర్తింపు దక్కనుంది. ఇక స్థానికంగా హోటల్ రంగం, రవాణా రంగం మరింత పుంజుకునే అవకాశలు ఉంటాయి. దీని వల్ల వేలమందికి ఉపాధి లభించే ఛాన్స్ ఉంటుంది.
ప్రపంచ వారసత్వ కట్టడాలు, కాకతీయుల చరిత్రతో వరంగల్ ఇప్పటికే పర్యాటకంగా గుర్తింపు పొందింది. విమానాశ్రయం అందుబాటులోకి వస్తే దేశ విదేశాల నుంచి పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో హోటళ్లు, రవాణా, స్థానిక ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్పై ఉత్తర తెలంగాణ ప్రజల్లో భారీ అంచనాలే ఉన్నాయి. గతంలో పలుమార్లు ప్రకటించినా కార్యరూపం దాల్చని ఈ విమానాశ్రయం ఇప్పుడు వాస్తవంగా మారుతుందన్న వార్తలతో ఉత్సాహం నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేస్తే, తెలంగాణ విమానయాన పటంలో మరో కీలక కేంద్రంగా వరంగల్ నిలవనుంది. వరంగల్ గుళ్లకు ప్రపంచ గుర్తింపు రానుంది.