Telangana News : పంటనష్టం రూ.415 కోట్లు

అత్యధికంగా వరి, పత్తికే నష్టం;

Update: 2024-09-03 05:15 GMT

భారీ వర్షాలు, వరదలతో ఇసుక మేట వేసిన పంటలు. నీట మునిగిన పైరులు. కొతకు గురైన పొలాలు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో 22 జిల్లాలకు చెందిన 131 మండలాల్లో 999 గ్రామాల్లో 4.15 లక్షల ఎకరాల్లో దాదాపు రూ.415 కోట్ల మేర పంట నష్టం అయినట్లు వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా వేసింది. అత్యధికంగా వరికి 1.80 లక్షల ఎకరాల్లోను, పత్తికి 1.06 లక్షలు, మొక్కజొన్న 20 వేలకు పైగా ఎకరాల్లో దెబ్బతింది. మిరప, మొక్కజొన్న, కందులు, సోయా, పెసర, మినుములు, కూరగాయలు తదితర పంటలకూ నష్టం జరిగింది. ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, జిల్లాల్లో ఎక్కువగా పంటలు దెబ్బతిన్నాయి. వరంగల్, నారాయణపేట, భద్రాద్రి, ఆదిలాబాద్, సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి తదితర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. పంటలు దెబ్బతినడంతో దాదాపు 85,323 మంది రైతులు బాధితులుగా మిగిలారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 46,374 మంది, మహబూబాబాద్‌ జిల్లాలో 18,089, సూర్యాపేటలో 9,227 మంది పంట నష్టపోయారు. ఇతర జిల్లాల్లోనూ పలువురు రైతులు నష్టపోయారు. పూర్తిస్థాయి నివేదిక తయారైన అనంతరం నష్టం వివరాలు సమగ్రంగా తెలుస్తాయని పేర్కొంది.

రైతులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి

భారీ వర్షాలతోనే కాకుండా.. నీటి నిల్వ వల్ల చీడపీడల బెడద పెరుగుతుందని దాన్ని నివారించేందుకు రైతులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచించింది. వరి, పత్తి, మొక్కజొన్న, సోయాచిక్కుడు, కంది, పెసర, మినుములకు ప్రస్తుతం ఉన్న పంటదశలో కొన్ని రకాల చీడపీడలు అధికంగా ఆశించే అవకాశం ఉందని, ముందస్తు చర్యలు చేపట్టడం వల్ల నష్టాల నుంచి కాపాడుకోవాలని అధికారులు తెలుతున్నారు.

Tags:    

Similar News