Adilabad: తెలంగాణలో ఉగ్రవాదుల హైఅలర్ట్.. ఆదిలాబాద్ను ఎంచుకొని..
Adilabad: ఉగ్రవాదులు తెలంగాణను అడ్డాగా మార్చుకోవాలనుకున్నారనే వార్త సంచనలం సృష్టిస్తోంది.;
Adilabad: ఉగ్రవాదులు తెలంగాణను అడ్డాగా మార్చుకోవాలనుకున్నారనే వార్త సంచనలం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఆదిలాబాద్నే సేఫ్ ప్లేస్గా ఎంచుకున్నారని తెలియడంతో నిఘా వర్గాలు అలర్ట్ అయ్యాయి. అసలు ఆదిలాబాద్నే ఉగ్రవాదులు ఎందుకు ఎంచుకున్నారన్న దానిపై ఆరా తీస్తున్నారు. పాకిస్తాన్ నుంచి భారత్కు డ్రోన్ ద్వారా ఆయుధాలను తీసుకొచ్చిన టెర్రరిస్టులు.. వాటిని ఆదిలాబాద్కు చేర్చేందుకు ప్లాన్ చేశారు. ఈక్రమంలో హర్యానా పోలీసులకు చిక్కారు.
ఆదిలాబాద్ జిల్లాకే ఆయుధాలు ఎందుకు తరలిస్తున్నారన్న దానిపై నిఘా వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. ఇక్కడైతే ఎవరికీ అనుమానం రాకుండా ప్రశాంతంగా ఉంటుందని, అందుకే ఉగ్రవాదులు తమకు అనువైన స్థావరంగా ఆదిలాబాద్ను ఎంచుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. పైగా ఆదిలాబాద్ జిల్లా మీదుగా ఎన్హెచ్-44 వెళ్తోంది. ఈ రోడ్ మీదుగా ఢిల్లీ చేరుకోవచ్చు. నిర్మల్ జిల్లా భైంసా నుంచి నాందేడ్కు వెళ్లి, అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లొచ్చు.
ఇక మంచిర్యాల మీదుగా నేరుగా ఢిల్లీకి రైల్వే మార్గం ఉంది. అందుకే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్డీఎక్స్తో పాటు ఆయుధాలను నిల్వచేసి ఉంచుకోవచ్చనే ఆలోచన ఉగ్రవాదులకు ఉండవచ్చని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. హర్యానా పోలీసులకు పట్టుబడిన ఈ నలుగురు ఉగ్రవాదులు కొంతకాలంగా హరివిందర్ సింగ్ రిండాతో సంప్రదింపులు జరుపుతున్నారు. పాకిస్తాన్కు చెందిన ఖలిస్థానీ ఉగ్రవాది హరివిందర్ సింగ్ రిండా టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో రాటుతేలాడు.
డ్రోన్ ద్వారా పంజాబ్లోని ఫిరోజ్పుర్ పొలాల్లోకి ఆయుధాలను చేరవేసింది కూడా రిండానే అని పోలీసులు తేల్చారు. వాటిని ఎక్కడికు తీసుకువెళ్లాలో ఓ యాప్ ద్వారా లొకేషన్ను కూడా పంపాడు. ప్లాన్ ప్రకారం పేలుడు పదార్థాలను ఇన్నోవాలోకి ఎక్కించిన ఉగ్రవాదులు.. నాందేడ్ మీదుగా ఆదిలాబాద్కు పయనమయ్యారు. అప్పటికే వీరి కదలికలపై కేంద్ర నిఘా సంస్థలు సమాచారం ఇచ్చాయి. దీంతో బస్తారా టోల్ ప్లాజా సమీపంలో ఉగ్రవాదుల కారును చాకచక్యంగా పట్టుకున్నారు.
అప్పటికే బాంబు డిస్పోజల్ టీమ్, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ను మోహరించారు. ముష్కరుల వాహనం నుంచి మూడు ఆర్డీఎక్స్ కంటైనర్లు, ఒక తుపాకీ, 31 రౌండ్ల లైవ్ క్యాటరిడ్జ్లతో పాటు లక్షన్నర క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. అటు జాతీయ దర్యాప్తు సంస్థలతో పాటు రాష్ట్ర దర్యాప్తు సంస్థలు సైతం ఆదిలాబాద్లో ఐఎస్ఐ కదలికలపై కూపీ లాగుతున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాది హరివిందర్సింగ్ రిండాతో ఆదిలాబాద్కున్న సంబంధం ఏంటని ఆరాతీస్తున్నారు. ఇక్కడి సంబంధాలపైనా సమాచారం సేకరిస్తున్నారు.