TG: తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఇంకెప్పుడు..?
జనగణనతోనే అడ్డంకి అన్న ఊహాగానాలు
తెలంగాణలో స్థానిక సంస్థల రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలతో ఉత్సాహంగా ముందుకు సాగిన రాజకీయ వాతావరణం, ఇప్పుడు ఎంపీటీసీ–జెడ్పీటీసీ ఎన్నికల చుట్టూ తిరుగుతోంది. ఈ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం రాకపోవడంతో అభ్యర్థుల్లో ఒకవైపు ఆశలు, మరోవైపు అనిశ్చితి నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీ సైతం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండగా, ఎన్నికల షెడ్యూల్పై ఇంకా స్పష్టత లేకపోవడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలను సాధించింది. ఈ విజయోత్సాహంతో వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా నిర్వహించాలని ప్రారంభంలో భావించింది. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా వేగవంతం చేశారు. కానీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవడంలో జాగ్రత్తలు పాటిస్తోంది.
అడ్డంకి జనగణనతోనేనా...
ప్రస్తుతం ఈ ఎన్నికల నిర్వహణకు ప్రధాన అడ్డంకిగా దేశవ్యాప్తంగా జరగనున్న జనాభా లెక్కల ప్రక్రియ నిలుస్తోంది. మే 11 నుంచి జూన్ 9 వరకు మొదటి విడత జనగణన జరగనుండగా, తదుపరి దశ 2027 ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలను వెంటనే నిర్వహించాలంటే జనగణన ప్రారంభానికి ముందే పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే ప్రభుత్వ యంత్రాంగంపై సిబ్బంది కొరత ఒత్తిడి పడే అవకాశం ఉంది. అందువల్ల జనగణన పూర్తయ్యాకే ఎన్నికలు నిర్వహించడం మంచిదనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది. ఇంకొక వైపు, మండల పరిషత్, జిల్లా పరిషత్ వ్యవస్థలపై సమగ్ర మార్పులు తీసుకురావాలనే ఆలోచన కూడా ప్రభుత్వ పెద్దల వద్ద చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చే దిశగా ప్రక్షాళన అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రాజకీయంగా చూస్తే పరిస్థితి మరోలా ఉంది. మే చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై కూడా చర్చ కొనసాగుతోంది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు విద్యార్థుల పరీక్షలు, అలాగే ఇతర రాష్ట్రాల ఎన్నికలు ముగియాల్సిన నేపథ్యంలో అప్పటి వరకు వేచి చూసిన ప్రభుత్వం, ఆ తర్వాత ఎన్నికలకు అనుకూల సమయం అని భావించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దిశగా ప్రాథమిక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సంకేతాలతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కేడర్ను సిద్ధం చేసే పనిలో పడింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పర్యటనలు చేస్తూ పార్టీ నాయకులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. టికెట్లు ఆశించే నాయకులు ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలని, కేవలం పైరవీలతో అవకాశాలు రావని ఆయన స్పష్టం చేస్తున్నారు. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజల్లో ఆదరణ పొందిన వారికే టికెట్లు కేటాయిస్తామని ఆయన హెచ్చరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 80 శాతం స్థానాలను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లా, మండల పరిషత్తులపై పూర్తి ఆధిపత్యం సాధించేందుకు పార్టీ వ్యూహాత్మకంగా కదులుతోంది. ఈ క్రమంలో జిల్లా అధ్యక్షులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షిస్తూ, నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించడంపై కూడా పీసీసీ చీఫ్ దృష్టి పెట్టారు. పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం పెంచడం ద్వారా ఎన్నికల్లో సమిష్టిగా పోటీ చేయాలనే లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారు. బూత్ స్థాయిలో పార్టీ బలాన్ని పెంచేందుకు చేపట్టిన కార్యక్రమాలపై కూడా జిల్లాల పర్యటనల్లో సమీక్షలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై స్పష్టత లేకపోయినా, రాజకీయంగా మాత్రం రంగం సిద్ధమవుది. ఒకవైపు జనగణన వంటి పరిపాలనా అంశాలు ఎన్నికల షెడ్యూల్ను ప్రభావితం చేస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం ముందుగానే వ్యూహాలతో కదులుతోంది.