Harish Rao : పంజాబ్ రైతులు నమ్మని డిక్లరేషన్..తెలంగాణ ప్రజలు ఎలా నమ్ముతారు: హరీష్ రావు
Harish Rao : వరంగల్ రైతు సంఘర్షణ సభలో రాహుల్ చేసిన విమర్శలపై TRS మంత్రులు ఫైర్ అవుతున్నారు.;
Harish Rao : వరంగల్ రైతు సంఘర్షణ సభలో రాహుల్ చేసిన విమర్శలపై TRS మంత్రులు ఫైర్ అవుతున్నారు. రైతును రాజు చేయడం కాంగ్రెస్ వల్ల అయ్యే పని కాదన్నారు. దమ్ముంటే కేంద్రంలో బీజేపీపై యుద్ధం చేయాలన్నారు. తెలంగాణకు పొలిటికల్ టూరిస్టులు వస్తూ పోతుంటారని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కేసీఆర్ మాత్రం ఎప్పటికీ తెలంగాణలోనే ఉంటారని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ రైతు సంఘర్షణ సభ బోగస్ అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పెట్టుబడి సాయం 15 వేల రూపాయలు అందిస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముందుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అక్కడ అమలు చేయకుండా ఇక్కడ చెబితే ప్రజలు నమ్మరని ఎద్దెవా చేశారు.కాంగ్రెస్ మోసపూరిత మాటలను ప్రజలు నమ్మరన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. రెండు లక్షల రుణమాఫీ హామీని 2018లో ప్రజలు నమ్మలేదని గుర్తు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇవ్వలేదని..మెడలు వంచి సాధించుకున్నామన్నారు. డిక్లరేషన్ వట్టిదేనన్నారు.
రాహుల్ గాంధీ టూర్పైనా మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఎయిర్పోర్టులో దిగి ఏం మాట్లాడాలి అని పార్టీ నేతలను అడిగే రాహుల్కు ఇక్కడి రైతులపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు. వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రమైన పంజాబ్ రైతాంగమే కాంగ్రెస్ను ఈడ్చి తన్నిందన్నారు హరీష్ రావు. పంజాబ్ రైతులు నమ్మని డిక్లరేషన్ను తెలంగాణ ప్రజలు ఎలా నమ్ముతారని ట్విట్టర్లో ప్రశ్నించారు. వరంగల్లో నిర్వహించింది రైతు సంఘర్షణ సభ కాదన్న హరీష్..అది కేవలం రాహుల్ సంఘర్షణ సభ మాత్రమేనన్నారు.