TSPSC: టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగులు
రాజీనామాలను ఆమోదించిన గవర్నర్... కొత్త ఛైర్మన్ నియామకం దిశగా ప్రభుత్వం అడుగులు;
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి. ఛైర్మన్తో పాటు ముగ్గురు సభ్యుల రాజీనామాల్ని గవర్నర్ ఆమోదించడంతో కొత్త బోర్డు ఏర్పాటు కానుంది. ఛైర్మన్తో పాటు పూర్తిస్థాయిలో సభ్యులను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొందరు IAS, IPS అధికారులు, ప్రొఫెసర్ల పేర్లను పరిశీలిస్తోంది. వీలైనంత త్వరగా ఛైర్మన్తో పాటు సభ్యుల్ని నియమించే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యంతో TSPSC తీవ్ర విమర్శల పాలైంది. కొత్త బోర్డు ఏర్పాటు చేసిన తరువాతే పరీక్షలు నిర్వహించాలని అప్పట్లో నిరుద్యోగులు డిమాండ్ చేశారు. తెలంగాణలో కొత్త సర్కారు కొలువుదీరడంతో కమిషన్ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని CM రేవంత్రెడ్డి నిర్ణయించారు. ఛైర్మన్తో పాటు పూర్తిస్థాయిలో సభ్యులను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది.
కొందరు IAS, IPS అధికారులు, ప్రొఫెసర్ల పేర్లను పరిశీలిస్తోంది. వీలైనంత త్వరగా ఛైర్మన్తో పాటు సభ్యుల్ని నియమించే అవకాశాలున్నట్లు సమాచారం. విమర్శలకు తావు లేకుండా నిబంధనల మేరకు ఛైర్మన్, సభ్యులను నియమించనున్నట్లు తెలిసింది. TSPSCని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు ఇతర రాష్ట్రాల PSCల్లో అమలు చేస్తున్న మెరుగైన విధానాల్ని అధ్యయనం చేసేందుకు ఉన్నతాధికారుల బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే కేరళ PSCని ఈ బృందం అధ్యయనం చేసింది. ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్ర అధికారులతో కలిసి UPSC ఛైర్మన్ను కలిసి పోటీ పరీక్షల నిర్వహణ పారదర్శకంగా చేపట్టేందుకు సూచనలు కోరారు. అధ్యయన నివేదిక వచ్చిన అనంతరం కమిషన్లో పలు మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి.
TSPSCకి నూతన బోర్డు ఏర్పాటైన తరువాత ఉద్యోగాల నియామక ప్రక్రియలో కదలిక రానుంది. గ్రూప్-2 పరీక్షలకు కొత్త తేదీల ఖరారుతో పాటు ఇప్పటివరకు పరీక్షల తేదీలు ప్రకటించని నోటిఫికేషన్లకు షెడ్యూలు ప్రకటించాలన్నా, పూర్తయిన పరీక్షల ఫలితాలు వెల్లడించాలంటే బోర్డు ఉండాలి. కమిషన్ నిబంధనల ప్రకారం ఏదైనా పరీక్ష నిర్వహణ తేదీ ఖరారు చేయాలన్నా.. ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలన్నా.. పరీక్ష వాయిదా వేయాలన్నా.. ఫలితాలు వెల్లడించాలన్నా.. బోర్డుదే నిర్ణయాత్మక అధికారం. ప్రభుత్వ విభాగాల నుంచి వచ్చిన ఖాళీల భర్తీ ప్రతిపాదనలు, సర్వీసు నిబంధనలు, పొరపాట్లు.. ఇలాంటివన్నీ పరిశీలిస్తుంది. బోర్డు తీసుకున్న నిర్ణయాలను కార్యదర్శి అమలు చేస్తారు. కార్యదర్శి ఆదేశాల మేరకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తారు. TSPSC నిబంధనల ప్రకారం బోర్డులో ఛైర్మన్తో పాటు 11 మంది సభ్యులు ఉండాలి. ప్రస్తుతం ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు. ఛైర్మన్ పదవి ఖాళీ అయింది. ఇద్దరు సభ్యులను పరిగణనలోకి తీసుకుంటే ఛైర్మన్తో పాటు తొమ్మిది మంది సభ్యుల్ని ప్రభుత్వం నియమించాల్సి ఉంది. మరోవైపు, కీలకమైన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పోస్టు ఖాళీగా ఉంది. UPSC, ఇతర రాష్ట్రాల PSCల్లో అమలు చేస్తున్న నియమావళి ప్రకారం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ హోదాలో నియమితులయ్యే IAS అధికారి స్థానిక రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయి ఉండకూడదు. అంటే తెలంగాణ వాస్తవ్యులు కాకూడదు. ఇతర రాష్ట్రాలకు చెందిన తెలంగాణ క్యాడర్ అధికారులు అయి ఉండాలి. గతంలో ఈ పోస్టులో నియమితులైన IAS అధికారి సంతోష్ ఇటీవలే బదిలీపై జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్గా వెళ్లారు. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది.