కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. సరస్వతీ పుష్కరాల్లో భాగంలో మొట్లపై జ్ఞానదీపాల డిజైన్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నది ఉప్పొంగి ప్రవాహిస్తుండడంతో ఆ డిజైన్లో కొంతభాగం మునిగిపోయి బాహుబలి సినిమాలోని సీన్ ను తలపిస్తోంది. చూపరులను ఇది ఆకట్టుకుంటోంది. మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత, గోదావరిలలో వరద ప్రవాహం పెరిగింది. మేడిగడ్డ బ్యారేజీకి 2,41,530 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. 85 గేట్ల నుంచి అంతే స్థాయిలో నీటిని దిగువకు పంపిస్తున్నారు. తుపాకులగూడెంలోని సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద నీటి మట్టం పెరిగింది. మొత్తం 59 గేట్లు ఎత్తి 5,10,470 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దేవాదుల ఇన్టేక్వెల్ నుంచి 1,078 క్యూసెక్కుల నీటిని భీం ఘనపూర్ రిజర్వాయర్లోకి పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.