Afghanistan: ఆత్మాహుతి బాంబు పేలుడు..

మంత్రి సహా 12 దుర్మరణం;

Update: 2024-12-12 00:18 GMT

ఆఫ్గనిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. రాజధాని కాబూల్‌లో బుధవారం ఓ సూసైడ్ బాంబర్ జరిపిన భారీ పేలుడు సంచలనం రేపింది. ఈ పేలుడులో తాలిబన్ ప్రభుత్వంలో శరాణర్థుల శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఖలీల్ ఉర్ రహ్మాన్ హక్కానీ చనిపోయారు. ఆయనతోపాటు ఆయనకు ఉండే బాడీగార్డ్‌లు సహా మొత్తం 12 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కాబూల్‌లోని శరణార్థుల మంత్రిత్వ శాఖ సమావేశం జరుగుతున్న ప్రాంగణంలో ఈ ఆత్మాహుతి దాడి జరగడం తీవ్ర సంచలనం రేపుతోంది. ఆఫ్గనిస్తాన్ మంత్రి ఖలీల్ ఉర్ రహ్మాన్ హక్కానీ మృతి చెందినట్లు తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు ధృవీకరించారు.

స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఖోస్ట్ నుంచి వస్తున్న వ్యక్తుల బృందానికి మంత్రి ఖలీల్ ఉర్ రహ్మాన్ హక్కానీ స్వాగతం పలుకుతున్న సమయంలో ఈ ఆత్మాహుతి దాడి జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ పేలుడు ఎలా జరిగింది.. ఎవరు చేశారు అనే విషయాల గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు. ఆఫ్గనిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇది ఒక ఆత్మాహుతి దాడి అని వెల్లడించింది. మీడియా కథనాల ప్రకారం.. ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకుని అక్కడే మరణించినట్లు తెలుస్తోంది.

ఈ ఆత్మాహుతి దాడిలో చాలా మంది గాయపడినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆత్మాహుతి పేలుడు కారణంగా ఆఫ్గనిస్తాన్ శరణార్థుల మంత్రిత్వ శాఖ కార్యాలయం ప్రాంగణం మొత్తం భీతావహంగా మారిపోయింది.

Tags:    

Similar News