Israel Palestine Conflict: ఇజ్రాయెల్ దెబ్బకి గాజాకి ఇబ్బందులు
ఫ్రీజర్ ట్రక్కుల్లో మృతదేహాలు;
హమాస్ చేసిన తప్పులకు గాజా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు దాడికి తెగబడిన సంగతి తెలిసిందే.. అప్పుడు ఉగ్రవాదులు దొరికినవారిని దొరికినట్లు దారుణంగా చంపేశారు. ఆడవాళ్లపై అత్యాచారాలు చేశారుఅభంశుభం తెలియని చిన్నారులను తలలు నరికారు.మోతానికి ఈ దాడుల్లో ఇజ్రాయిల్ వైపు 1300 మంది ప్రజలు మరణించారు. ఈ దాడితో తీవ్ర ప్రతీకారేచ్ఛతో ఇజ్రాయిల్ రగిలిపోతోంది. గాజాపై నిప్పుల వర్షం కురిపిస్తోంది.
హమాస్పై ఇజ్రాయెల్ ప్రతిదాడి అనంతరం మృతదేహాలు వీధుల్లో చిందరవందరగా ఉన్నాయి. హమాస్ కార్యకర్తలు ఉన్నారన్న అనుమానం ఉన్న ప్రతీ భవనాన్ని లేపేస్తోంది. భారీ దాడులతో గాజా ప్రాంతంలో మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే అక్కడ 2300 మందికి పైగా మరణాలు చోటు చేసుకున్నాయి. గాజాలోని ఆరోగ్య శాఖ అధికారులు మాట్లాడుతూ మృతదేహాలను నిల్వ చేయడానికి ఆసుపత్రి మార్చురీలలో ఖాళీ స్థలం లేదని, అందువల్ల మృతదేహాలను ఐస్క్రీమ్ ఫ్రీజర్ ట్రక్కులలో ఉంచుతున్నామని చెప్పారు.
అంతంత మాత్రం ఆరోగ్య సదుపాయలు ఉన్న గాజా ప్రాంతంలో పరిస్థితులు దిగజారుతున్నాయి. మృతదేహాలను పెట్టేందుకు ఆస్పత్రిలో స్థలం లేకపోవడంతో ఐస్ క్రీమ్ తరలించే ట్రక్కుల్లో మృతదేహాలను నిల్వ చేస్తున్నారు. ఐస్ క్రీం కంపెనీల నుంచి ఐస్ క్రీం ఫ్రీజర్లను తీసుకుని వచ్చామని, ఆస్పత్రి మార్చురీలో కేవలం 10 మృతదేహాలను మాత్రమే పెట్టగలిగే సామర్థ్యం ఉందని డీర్అల్ లోని షుహదా అల్-అక్సా ఆస్పత్రికి చెందిన డాక్టర్ యాసర్ అలీ చెప్పారు. ఇలాగే యుద్ధం కొనసాగితే శ్మశానాలు కూడా సరిపోవని, ఇప్పటికే అవన్నీ నిండిపోయాయని అక్కడి ప్రజలు తెలుపుతున్నారు. సూపర్ మార్కెట్లకు ఐస్ క్రీమ్లను సరఫరా చేసే ట్రక్కుల్లో మృతదేహాలను తాత్కాలికంగా భద్రపరుస్తున్నారు. అయితే లెక్కకు మించి మృతదేహాలు వస్తుండటంతో ఈ టక్కులు కూడా సరిపోవడం లేదు. ఒక్కో ట్రక్కులో 20-30 మృతదేహాలను పెడుతున్నారు.
అదే సమయంలో, గాజా నగరంలో సామూహిక సమాధులను అధికారులు సిద్ధం చేస్తున్నారని ప్రభుత్వ మీడియా కార్యాలయ అధిపతి సలామా మరూఫ్ చెప్పారు. అల్-షిఫా ఆసుపత్రి మార్చురీలో పెద్ద సంఖ్యలో మృతదేహాలను ఉంచి అంత్యక్రియలు చేయడానికి బంధువులు రావడం లేదని ఆయన అన్నారు. దాదాపు 100 మృతదేహాలను ఖననం చేసేందుకు అత్యవసర శ్మశానవాటికలో సామూహిక సమాధిని సిద్ధం చేశారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇప్పటివరకు 2,300 మందికి పైగా మరణించారని, 10,000 మందికి పైగా గాయపడ్డారని గాజా అధికారులు వెల్లడించారు.