Earth Quake: నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో భారీ భూకంపం..
ప్రమాదంలో మృతి చెందిన 36 మంది..;
నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో భారీ భూకంపం వచ్చింది. ఈరోజు ( జనవరి 7) ఉదయం ఇక్కడ భూకంపం సంభవించడంతో రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా రికార్డు అయింది. కొన్ని క్షణాల పాటు ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఈ విపత్తుతో ఇప్పటి వరకు సుమారు 36 మంది చనిపోయిగా.. మరో 38 మంది త్రీవంగా గాయపడినట్లు చైనా అధికారిక మీడియా తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చింది.
కాగా, నేపాల్-టిబెట్ సరిహద్దుకు 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న లబుచె ప్రాంతంలో నేటి ఉదయం 6.35 గంటలకు ఈ భూకంపం ఏర్పడింది. టిబెట్లోని షిజాంగ్లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేపాల్ అధికారులు తెలిపారు. దీని తీవ్రతతో నేపాల్ రాజధాని కాఠ్మాండూ సహా పలు జిల్లాల్లో భూ ప్రకంపనలు నెలకొన్నాయి. ఈ ప్రకంపనల ధాటికి ప్రజలు భయంతో బయటకు పరుగులు పెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక, ఈ భూ ప్రకంపనలతో భారత్లోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా స్పల్పంగా కనిపించింది. ఢిల్లీ-ఎన్సీఆర్, పశ్చిమ బెంగాల్, బిహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు తెలుస్తుంది. అటు చైనా, భూటాన్, బంగ్లాదేశ్లోని పలు ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు సంభవించినట్లు టాక్. డ్రాగన్ కంట్రీలో భూకంప తీవ్రత 6.8గా నమోదు అయింది. కాగా, నేపాల్లో తరచూ భారీ భూకంపాలు వస్తుంటాయి. 2015 ఏప్రిల్లో ఇక్కడ 7.8 తీవ్రతతో భూకంపం సంభవించడంతో దాదాపు 9వేల మంది మరణించారు.