China: భూటాన్ భూభాగంలో చైనా అక్రమ నిర్మాణాలు..
సరిహద్దుల్లోకి చైనా చొరబడి గ్రామాలు , ఔట్పోస్ట్లు నిర్మాణం;
పొరుగు దేశాల భూభాగాలను కబ్జా చేయడం చైనాకు వెన్నతో పెట్టిన విద్య. విస్తరణవాద కాంక్షతో రగిలిపోయే డ్రాగన్.. పక్క దేశాల ప్రాంతాలను తమవిగా చెప్పుకుంటే జెండా పాతేయడం అలవాటు చేసుకుంది. భూటాన్తో సరిహద్దు వివాదంపై ఓ పక్క చర్చలు జరుగుతుంటే.. తాజాగా, ఉత్తర భూటాన్లోని జకర్లుంగ్ వ్యాలీలో అనుమతి లేని నిర్మాణ కార్యకలాపాలను చైనా చేపట్టిన్నట్టు ఉపగ్రహ ఫోటోలు బయటపెట్టాయి. అరుణాచల్ ప్రదేశ్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూటాన్ తూర్పు సరిహద్దు ఈ ప్రాంతంలో చైనా చర్యలను అంగీకరించడం తప్ప థింఫుకు వేరే మార్గం లేదని శాటిలైట్ ఫోటోలు సూచిస్తున్నాయి.
‘ఇంతకుముందు పశువుల కాపర్ల చర్యల ఆధారంగా ఒక ప్రాంతాన్ని తమదిగా చైనా వాదించేది.. కానీ, ఇవి మునుపెన్నడూ లేని చర్యలు.. ఏకపక్షంగా భూభాగాన్ని స్వాధీనం చేసుకుని, గ్రామాలు, సైనిక బ్యారక్లు, అవుట్పోస్టులతో స్థిర ఆవాసాలను ఏర్పాటుచేసుకుని ఆక్రమణకు పాల్పడుతోంది’ అని యూనివర్సిటీ ఆఫ్ లండన్లోని స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ (SOAS)టిబెటన్ చరిత్ర నిపుణుడైన ప్రొఫెసర్ రాబర్ట్ బార్నెట్కి అన్నారు.
మరోవైపు గుజరాత్, ముంబై తీరం సమీపంలోని అరేబియా సముద్రంలో వందలాది చైనా ఫిషింగ్ ఓడలను నిఘా సంస్థలు గుర్తించాయి. మినీ గూఢచార నౌకలుగా పని చేస్తున్న వీటి సంఖ్య ఇటీవల కాలంలో పెరుగడంపై ఆందోళన వ్యక్తం చేశాయి. జలాంతర్గాములు, రహస్య పైప్లైన్లు, ఇండియన్ పోర్ట్లకు సంబంధించిన సమాచారాన్ని ఇవి సేకరిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో రక్షణ పరంగా పొంచి ఉన్న ముప్పుపై ఇంటెలిజెన్స్ నివేదికలు హెచ్చరించాయి.
కాగా, భారత్ ఆధిపత్య సముద్ర జలాల్లోకి చైనా ఓడల ఆకస్మిక ప్రవేశాన్ని నిశితంగా గమనిస్తున్నట్లు ఇండియన్ నేవీ తెలిపింది. దక్షిణ చైనా సముద్రంలో అవలంభిస్తున్న వ్యూహాల మాదిరిగా గ్రే జోన్లో చైనా కార్యక్రమాలకు చెక్ పెట్టేందుకు పలు యుద్ధ నౌకలను మోహరించినట్లు పేర్కొంది. ‘చాలా చైనా ఓడలు వ్యూహాత్మకంగా భారత్ ప్రత్యేక ఆర్థిక జోన్ (ఈఈజెడ్) ముగిసే 200 నాటికల్ మైళ్ల వెలుపల ఉన్నాయి’ అని ఇండియన్ నేవల్ డిఫెన్స్ అడ్వైజరీ గ్రూప్కు చెందిన సీనియర్ నేవీ కమాండర్ ధృవీకరించారు.