operation sindoor: ఫలించిన భారత్ దౌత్యం. . స్టేట్మెంట్ వెనక్కి తీసుకున్న కొలంబియా
ఆపరేషన్ సిందూర్పై ఎంపీల బ్రీఫింగ్ సక్సెస్..;
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సందూర్ చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు చేయగా 200 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో కొలంబియా ముష్కరుల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన జారీ చేసింది. అయితే దీనిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ ఇప్పటికే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ఈయన నేతృత్వం వహిస్తున్న బృందమే కొలంబియాకు వెళ్లగా.. ఆపరేషన్ సిందూర్ సహా పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఎలా మద్దతు ఇస్తుందో వివరించారు. దీంతో దాయాది దేశం అసలు రంగు తెలుసుకున్న కొలంబియా తన సంతాప ప్రకటనను వెనక్కి తీసుకుంది.
అఖిల పక్ష బృందాల దౌత్య వ్యూహం మంచి ఫలితాలు ఇస్తోంది. పహల్గాం ఉగ్రదాడి ఘటన ఆ తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్లను ప్రపంచానికి వివరించి ఉగ్రవాదంపై భారత పోరాటానికి మద్దతు కూడగట్టేందుకు, భారత్కు దౌత్య పరంగా నిలిచేందుకు ఉద్దేశించి అఖిలపక్ష బృందాలు వివిధ దేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా శశి థరూర్ నేతృత్వంలోని భారతీయ బృందం కొలంబియా వెళ్లగా అక్కడి ప్రభుత్వం భారతీయులకు కాకుండా ఉగ్రవాదులకు సంతాపం తెలపడం, దానిపై కొలంబియాలోనే ఉండే శశి థరూర్ బృందం మీడియా ముఖంగా అసహనం వ్యక్తం చేయడం తెలిసిందే. ఈ క్రమంలోనే తమ సంతాప ప్రకటనను కొలంబియా వెనక్కి తీసుకుంది.
శశి థరూర్ నేతృత్వంలోని బృందం కొలంబియా విదేశాంగ శాఖ ఉప మంత్రి రోసా యెలాండ్ విల్లావిసెన్సియోతో భేటీ అయింది. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి, ఆ తర్వాత భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్కు సంబంధించిన పూర్తి విషయాలను థరూర్ కొలంబియా మంత్రికి తెలియజేశారు. ఈ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన శశి థరూర్ ఆపరేషన్ సిందూర్లో చనిపోయిన ఉగ్రవాదులకు కొలంబియా సంతాపం ప్రకటించడంపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో కొలంబియాపై అంతర్జాతీయంగా ఒత్తిడి రాగా.. తాజాగా కొలంబియా మంత్రి యెలాండ్ మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు.
భారత బృందం తమకు అన్ని విషయాలను తెలియజేసిందని, కశ్మీర్లో ఏం జరిగిందనేది పూర్తిగా తెలుసుకున్నామని అన్నారు. దాడులకు దారితీసిన పరిస్థితిపై అవగాహన వచ్చిందని పేర్కొన్నారు. ఈ ప్రకటన అనంతరం శశి థరూర్ బృందం కొలంబియా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదంపై తమ వైఖరిని వారు పూర్తిగా తెలుసుకున్నారని థరూర్ తెలియజేశారు.