Donald Trump: 30కి పైగా దేశాలపై ట్రావెల్ బ్యాన్ !
15 దేశాలకు చెందిన పౌరులపై పాక్షిక ఆంక్షలు విధించిన యూఎస్..
ప్రభుత్వం ప్రయాణ నిషేధాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరింత కఠినతరం చేశారు. తాజాగా మరో ఐదు దేశాల పౌరులపై పూర్తిస్థాయి ప్రయాణ నిషేధాన్ని అమలు చేయడంతో.. పాలస్తీనా అథారిటీ జారీ చేసిన పత్రాలతో ప్రయాణించే వారికి పూర్తిగా ప్రవేశంపై బ్యాన్ విధించింది. అలాగే, మరో 15 దేశాల పౌరులపై పాక్షిక పరిమితులు విధించింది. ఇప్పటి వరకు మొత్తం 30కి పైగా దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించినట్లు మంగళవారం వైట్ హౌస్ అధికారికంగా ప్రకటించింది.
దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని అమెరికా ప్రవేశ ప్రమాణాలను మరింత కఠినతరం చేస్తున్నట్లు వైట్ హౌస్ పేర్కొంది. కొన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై సరైన సమాచారం లేకపోవడం వల్ల భద్రతాపరమైన ముప్పు ఉందని అమెరికా అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే జూన్లో ట్రంప్ ప్రభుత్వం 12 దేశాల పౌరులకు యూఎస్ ప్రవేశంపై నిషేధం విధించింది. అదే సమయంలో మరో ఏడు దేశాలపై కఠినమైన వీసా, స్క్రీనింగ్ పరిమితులు అమలు చేసింది. ఆ జాబితాలో అఫ్గానిస్తాన్, మయన్మార్, చాద్, కాంగో రిపబ్లిక్, ఈక్వేటోరియల్ గినియా, ఎరిట్రియా, హైటి, ఇరాన్, లిబియా, సోమాలియా, సుడాన్, యెమెన్ ఉన్నాయి. అలాగే, బురుండి, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, టోగో, తుర్క్మెనిస్తాన్, వెనిజులా దేశాలపై పాక్షిక ఆంక్షలను విధించారు.
కొత్తగా పూర్తిస్థాయి నిషేధంలోకి వచ్చిన దేశాలు
తాజాగా, బుర్కినా ఫాసో, మాలి, నైజర్, దక్షిణ సుడాన్, సిరియా దేశాల పౌరులపై పూర్తిస్థాయి ప్రయాణ నిషేధాన్ని విస్తరించింది. దీని వల్ల ఆయా దేశాల ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రత్యేక అనుమతులు ఇస్తామని యూఎస్ అధికారులు తెలిపారు. ఈ దేశాల్లో అవినీతి, నకిలీ పౌర పత్రాలు, సరైన క్రిమినల్ రికార్డుల వంటి అంశాలు అమెరికా భద్రతా తనిఖీలను బలహీనపరుస్తున్నాయని వైట్ హౌస్ వెల్లడించింది. అలాగే, వీసా గడువు ముగిసిన తరువాత కూడా అమెరికాలోనే ఉండిపోవడం, తమ పౌరులను తిరిగి తీసుకెళ్లకపోవడంలో ప్రభుత్వాలు సహకరించకపోవడం లాంటి కారణాలనూ ప్రస్తావించింది.
ఇక, ఈ నిర్ణయాలతో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రయాణ విధానం మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. భద్రత పేరుతో తీసుకున్న ఈ చర్యలు మానవ హక్కులు, వలస విధానాలపై ప్రభావం చూపనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.