Indonesia Floods: ఇండోనేషియాలో ఆకస్మిక వరదలు.. 14 మంది మృతి
జనవరి, ఫిబ్రవరిలో భారీ వర్షాలుంటాయని హెచ్చరిక
ఇండోనేషియాలో మరోసారి ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. గతేడాది నవంబర్లో వచ్చిన వరదలతో అతలాకుతలం అయింది. అప్పట్లో 1,000 మంది వరకు చనిపోయారు. తాజాగా సోమవారం కూడా మరోసారి ఉత్తర సులవేసిలో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో 14 మంది మృతి చెందగా.. నలుగురు గల్లంతయ్యారు. వందలాది మంది నిరాశ్రయులయ్యారు.
సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం కారణంగా సియావు టాగులాండాంగ్ బియారో ప్రాంతంలో ఉన్న సియావు ద్వీపంలో ఆకస్మిక వరదలు సంభవించాయని స్థానిక రెస్క్యూ ఏజెన్సీ ప్రతినిధి నురియాడిన్ గుమెలెంగ్ తెలిపారు. ఇప్పటి వరకు 14 మంది చనిపోయారని.. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నట్లు మంగళవారం అధికారులు తెలిపారు. ఇంకో 18 మంది గాయపడినట్లు చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రాళ్లు పేరుకుపోయాయని.. బురదతో కప్పబడిందని వెల్లడించారు.
జావా, సులవేసి, మలుకు, పాపువా దీవుల్లో ఈ సంవత్సరం జనవరి- ఫిబ్రవరి నెలల్లో గరిష్ట వర్షాకాలం ఉంటుందని.. దీనివల్ల వరదలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వాతావరణ సంస్థ తెలిపింది.