US Immigration: హెచ్1బీ వీసా ఇంటర్వ్యూలకు భారీ ఆలస్యం
హెచ్1బీ వీసా దరఖాస్తు చేసేవారికి బిగ్ షాక్..
హెచ1బీ వీసా దరఖాస్తుదారులకు మరో షాక్ తగిలింది! ఇప్పటికే వీసా ఇంటర్వ్యూలు ఆలస్యం అవుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతుంటే.. ఈ ఏడాదికి సంబంధించిన ఇంటర్వ్యూ స్లాట్స్ 2027కు వాయిదా పడ్డట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వీసా బ్యాక్లాగ్స్ పెరిగినందున ఇంటర్వ్యూ స్లాట్స్.. వచ్చే ఏడాదికి మారినట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే వీసా స్టాంపింగ్ కోసం భారత్కు వచ్చిన అనేక మంది హెచ్1బీ వీసాదారులు ఈ వార్తలతో బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం అమెరికాలో ఉన్న హెచ్1బీ వీసాదారులు.. వీసా స్టాంపింగ్ కోసం భారత్ వెళ్లొద్దని ఇమ్మిగ్రేషన్ నిపుణలు సూచిస్తున్నారు.
కాగా, 2025 డిసెంబర్లో జరగాల్సిన వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలు.. 2026కి వాయిదా వేశారు. అనంతరం అక్టోబర్లో జరుగుతాయని చెప్పారు. ప్రస్తుతం 2027లో జరుగుతాయని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే స్టాంపింగ్ కోసం భారత్కు వచ్చిన వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జనవరి, ఫిబ్రవరిలో అపాయింట్మెంట్లు ఉన్న వారికి.. ఏడాది తర్వాత తేదీలను కేటాయిస్తూ ఈమెయిల్స్ వచ్చాయని తెలుస్తోంది. దీంతో వేలాది మంది వృత్తి నిపుణులు ఇక్కడే చిక్కుకుపోయినట్లు అయింది. భార్యా పిల్లలను వదిలి వచ్చిన కొందరికి.. ఈ పరిస్థితి ఇబ్బంది కరంగా మారింది.
భారతీయులకు తీవ్ర ఇబ్బందులు..
వీసా స్టాంపింగ్ కోసం భారత్కు వచ్చిన వారికి ఎంప్లాయిమెంట్ కాంట్రాక్టులు, హౌసింగ్ అగ్రిమెంట్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. వీసా గడువు ముగిసిన చాలా మంది ఉద్యోగులకు వారి.. యజమానులు పొడిగింపులను ఇవ్వడం లేదట. అంతేకాకుండా హెచ్1బీ వీసాపై గతంలో ట్రంప్ లక్ష డాలర్ల ఫీజు విధించడంతో.. కొత్త వీసా దరఖాస్తు చేయడానికి కంపెనీలు ముందుకు రావడం లేదట. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇంటర్వ్యూలు ఏకంగా వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయన్న వార్తలతో మరింత ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పరిణామాలపై అమెరికాలో వలసల వ్యవహారాల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 50 రోజుల్లో భారత్లో ఒక్క వీసా స్లాట్ కూడా అందుబాటులోకి వచ్చినట్టు తమ దృష్టికి రాలేదని తెలిపారు. అమెరికాలో ఉంటున్న వారు భారత్కు తిరిగెళ్లొద్దని సూచించారు. అయితే వీసా జారీని వారు మరింత ఆలస్యం చేస్తున్నారని.. కుదిరితే ఏకంగా వీసా దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని వారు అభిప్రాయపడుతున్నారు.
కాగా, కొందరు ఇమిగ్రేషన్ లాయర్ల ప్రకారం ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్కతాలోని అమెరికన్ కాన్సులేట్స్లో.. రెగ్యులర్ ఇంటర్వ్యూ స్లాట్స్ లేకపోవడంతో అధికారులు అపాయింట్మెంట్స్ను వచ్చే ఏడాదికి మర్చినట్లు చెబుతున్నారు. వీసా లబ్ధిదారుల సోషల్ మీడియా అకౌంట్స్ స్క్రీనింగ్ అమెరికా ప్రభుత్వం తప్పనిసరి చేయడం వల్ల.. దరఖాస్తులు పేరుకుపోయి బ్యాక్లాగ్స్కు దారి తీసినట్టు చెబుతున్నారు.