అమెరికా బాంబులకు అందనంత లోతులో ఒక పర్వతం అట్టడుగున అణు కేంద్రాన్ని ఇరాన్ నిర్మిస్తోంది. అది అమెరికా వైమానిక దాడుల్లో దెబ్బ తిన్న ఫోర్డో అణు కేంద్రానికి దక్షిణంగా దాదాపు 145 కి.మీ.ల దూరంలో, మధ్య ఇస్ఫహన్ ప్రావిన్సులో నాతంజ్ అణు కేంద్రానికి కొద్ది నిముషాల ప్రయాణంతో చేరుకునేంత దూరంలో ఉన్న పిక్యాక్స్ పర్వతం అడుగున నిర్మితమవుతోంది. ఈ నిర్మాణాన్ని ఇరాన్ గత నాలుగేళ్లుగా అత్యంత రహస్యంగా జరుపుతోందని ది టెలిగ్రాఫ్ తెలిపింది. ఈ పర్వతానికి తూర్పు వైపున రెండు, పశ్చిమాన రెండు కలుపుకొని మొత్తంగా నాలుగు సొరంగ ప్రవేశాలను ఇరాన్ తవ్వుతోందని అసోసియేట్ ప్రెస్ (ఏపీ) వెల్లడించింది. ఇరాన్ అణు శుద్ధి కార్యక్రమానికి తలమానికమైన ఫోర్డోలో కేంద్రానికి రెండు ప్రవేశ సొరంగాలు మాత్రమే ఉన్నాయి.
ఫోర్డోను భూమట్టానికి 60 నుంచి 90 మీటర్ల లోతున నిర్మించగా, పిక్క్స్ పర్వతానికి చెందిన కొత్త అణుకేంద్రం భూమట్టానికి 100 మీటర్ల లోతున నిర్మితమవుతోంది. ఫోర్మోను దృష్టిలో పెట్టుకొని అమెరికా అభివృద్ధి చేసిన జీబీయూ-57 బాంబు భూగర్భంలో 60 మీటర్లవరకు మాత్రమే చొచ్చుకొనివెళ్లి లక్ష్యాన్ని ఛేదించగలదు. ఆ లెక్కన చూస్తే పర్వతం కింద ఇరాన్ సిద్ధం చేస్తున్న అణు కేంద్రాన్ని అమెరికా బస్టర్ బాంబులు కనీసం తాకను కూడా తాకలేవు. పికాక్స్ పర్వతం వద్ద నిర్మిస్తున్న కేంద్రం పరిమాణాన్ని బట్టి చూస్తే ఇరాన్ ఇక్కడ సెంట్రిఫ్యూజ్లను తయారుచేయడంతో సరిపుచ్చుకోకుండా యురేనియంను శుద్ధి చేసే కార్యక్రమాన్ని చేపడుతుందనే ఆందోళనను నిపుణులు వ్యక్తం చేశారు.