Lashkar-e-Taiba: మా ప్రధాన స్థావరం ధ్వంసమైంది: లష్కరే కమాండర్‌ అంగీకారం

ధ్వంసమైన స్థావరాన్ని పాక్ ఆర్మీ, ప్రభుత్వం నిధులతో తిరిగి నిర్మాణం

Update: 2025-09-19 06:30 GMT

పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థల గుట్టు ఒక్కొక్కటిగా రట్టవుతోంది. కొన్ని రోజుల క్రితం జైషే మహమ్మద్ (జేఈఎం) కమాండర్ భారత సైన్యం దాడుల గురించి నిజాలు వెల్లడించగా, తాజాగా లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) వంతు వచ్చింది. భారత సైన్యం జరిపిన 'ఆపరేషన్ సిందూర్' దాడిలో తమ ప్రధాన స్థావరం పూర్తిగా ధ్వంసమైందని లష్కరే కమాండర్ ఖాసిం స్వయంగా అంగీకరించడం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఒప్పుకోలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాకిస్థాన్ మరోసారి అంతర్జాతీయంగా ఇరకాటంలో పడింది.

సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న ఒక వీడియోలో, లష్కరే కమాండర్ ఖాసిం పాకిస్థాన్‌లోని మురిద్కేలో నిర్మాణంలో ఉన్న ఒక ప్రదేశం ముందు నిలబడి మాట్లాడాడు. "భారత్ జరిపిన దాడిలో ధ్వంసమైన మర్కజ్ తైబా శిథిలాలపై నేను నిలబడి ఉన్నాను. దీని పునర్నిర్మాణ ప్రక్రియ కొనసాగుతోంది. దేవుడి దయతో, ఈ మసీదును మునుపటి కంటే పెద్దదిగా నిర్మిస్తాం" అని పేర్కొన్నాడు. గతంలో ఈ స్థావరంలో ఎందరో ముజాహిదీన్లు, తలబాలు శిక్షణ పొంది విజయం సాధించారని కూడా ఖాసిం అంగీకరించాడు.

ఈ ఏడాది మే 7న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు 26 మంది పౌరులను హతమార్చిన ఘటనకు ప్రతీకారంగా, భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' పేరిట పాకిస్థాన్, పీవోకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై ఏకకాలంలో దాడులు జరిపింది. ఇందులో భాగంగానే మురిద్కేలోని లష్కరే ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేసింది. అయితే, ఆ భవనాన్ని ఉగ్రవాద సంస్థ ఇకపై ఉపయోగించడం లేదని పాకిస్థాన్ బుకాయించే ప్రయత్నం చేసింది.

మరో వీడియోలో లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి మాట్లాడుతూ మురిద్కే స్థావరం పునర్నిర్మాణానికి పాకిస్థాన్ ప్రభుత్వం, సైన్యం నిధులు సమకూరుస్తున్నాయని చెప్పడం గమనార్హం. ఈ వాదనలకు బలం చేకూరుస్తూ లష్కరే తన ప్రధాన కార్యాలయాన్ని రహస్యంగా పునర్నిర్మిస్తోందని భారత నిఘా వర్గాలు కూడా ధ్రువీకరించాయి. 2026 ఫిబ్రవరి 5న (కశ్మీర్ సాలిడారిటీ డే) ఈ కొత్త భవనాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

గతంలో జైషే మహమ్మద్ కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ కూడా ఇలాగే ఒక వీడియోలో మాట్లాడుతూ బహావల్‌పూర్‌పై జరిగిన దాడుల్లో జేఈఎం చీఫ్ మసూద్ అజార్ కుటుంబం ‘ఛిన్నాభిన్నమైంది’ అని అంగీకరించాడు. ఆపరేషన్ సిందూర్‌లో చనిపోయిన వారి అంత్యక్రియలకు పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ స్వయంగా జనరల్స్‌ను పంపారని కూడా అతను తెలిపాడు. ఇలా ఉగ్రవాదులే స్వయంగా నిజాలు బయటపెడుతుండటంతో, ఉగ్రవాదానికి అండగా నిలుస్తున్న పాకిస్థాన్ వైఖరి మరోసారి బహిర్గతమైంది.

Tags:    

Similar News