Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా యూనస్
పార్లమెంటును రద్దుచేసిన అధ్యక్షుడు, ఎన్నికలకు మార్గం సుగమం
షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్లో మొదలైన రాజకీయ సంక్షోభం తాత్కాలికంగా కొలిక్కి వచ్చింది. రాజకీయ సంక్షోభం తలెత్తిన బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వానికి మహమ్మద్ యూనస్ నేతృత్వం వహించనున్నారు. ఆయన నోబెల్ శాంతి పురస్కార గ్రహీత. ప్రధానిగా ఉన్న షేక్ హసీనా వైదొలగాల్సి రావడంతో అధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్దీన్ మంగళవారం ఉదయం పార్లమెంటును రద్దు చేశారు. తొలుత తాత్కాలిక పరిపాలన యంత్రాంగం ఏర్పాటుకు, తర్వాత కొత్తగా ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమం చేశారు. యూనస్ను సారథిగా నియమిస్తున్నట్లు మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆయన ప్రకటన వెలువరించారు.
యూనస్ 2012 నుంచి 2018 వరకు స్కాట్లాండ్లోని గ్లాస్గో కాలెడోనియన్ విశ్వవిద్యాలయానికి కులపతిగా ఉన్నారు. చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ఆచార్యునిగా సేవలందించి, బంగ్లాదేశ్లోని పేదల అభ్యున్నతి కోసం కృషిచేశారు. చిట్టగాంగ్లో 1940లో జన్మించిన ఆయన ఓ సామాజిక కార్యకర్త, బ్యాంకర్, ఆర్థిక వేత్త. మైక్రోఫైనాన్స్ బ్యాంక్ ద్వారా లక్షల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసిన ఘనత సాధించారు. అందుకు 2006లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను పొందారు. పార్లమెంటును రద్దు చేయాలన్నది బంగ్లాదేశ్లో ఉద్యమకారుల ప్రధాన డిమాండ్. తాత్కాలిక ప్రభుత్వ సారథి పేరునూ వాళ్లే ప్రతిపాదించారు. సైనిక సర్కారును, సైన్యం మద్దతు ఉండే మరేదైనా సర్కారును అంగీకరించేది లేదని స్పష్టంచేశారు. హసీనా సర్కారుతో ఘర్షణపడినందుకు యూనస్పై కొన్ని డజన్ల కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో ఆరు నెలల జైలుశిక్ష పడింది. తన దేశం, ప్రజల కోసం ఎలాంటి బాధ్యతలైనా తీసుకుంటానని యూనస్ చెప్పారు. దేశంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలని పిలుపునిచ్చారు. హసీనా వైదొలగడంతో దేశానికి రెండోసారి విముక్తి లభించిందని వ్యాఖ్యానించారు.
బంగ్లాదేశ్ సైన్యంలో మేజర్ జనరల్గా ఉన్న జియావుల్ అహ్సాన్పై వేటుపడింది. లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ సైఫుల్ అలాంను విదేశాంగ మంత్రిత్వశాఖకు కేటాయించారు. మరికొందరు లెఫ్టినెంట్ జనరళ్లనూ వారి స్థానాల నుంచి తప్పించారు. బంగ్లాదేశ్ను వీడి భారత్కు వెళ్లేందుకు ప్రయత్నించిన ఐటీశాఖ మాజీ మంత్రి జునైద్ అహ్మద్ పలక్ను, విదేశాంగ మాజీ మంత్రి హసన్ మహమూద్ను అధికారులు ఢాకా విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. సముద్ర మార్గం ద్వారా భారత్కు వెళ్లాలని కూడా తొలుత మహమూద్ విఫలయత్నం చేశారు. హసీనాకంటే ముందే పలువురు నేతలు దేశం వీడి వెళ్లినట్లు తెలుస్తోంది. హసీనాను, ఆమె సోదరిని అరెస్టు చేసి బంగ్లాదేశ్కు తిరిగి పంపాలని బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మహబూబ్ ఉద్దీన్ ఖొఖోన్ భారత్ను కోరారు.