PM Modi : భారత్- రష్యా సంబంధాలు సుస్థిరంగా ఉన్నాయి : మోదీ
ఇండియా-రష్యాల మధ్య 21వ సమావేశం జరిగింది. ఢిల్లీలోని హైదరాబాద్ భవన్లో రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.;
ఇండియా-రష్యాల మధ్య 21వ సమావేశం జరిగింది. ఢిల్లీలోని హైదరాబాద్ భవన్లో రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రక్షణ, ఇంధన, వాణిజ్యం, పెట్టుబడులపై ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. అఫ్గానిస్థాన్లో నెలకొన్న పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు.
రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, భారత్తో పుతిన్కు ఉన్న అనుబంధాన్ని మోదీ గుర్తు చేశారు. కొవిడ్ సంక్షోభ సమయంలో వ్యాక్సిన్తో పాటు మానవతా సహాయంలో ఇరు దేశాలు పూర్తి సహకారం అందించుకున్నాయన్నారు. ఇరుదేశాల సంబంధాలు సుస్థిరంగా ఉన్నాయన్నారు మోదీ. గడిచిన దశాబ్దంలో ప్రపంచంలో అనేక మార్పులను చూశమన్న మోదీ...భౌగోళికంగా రాజకీయంగా ఆర్థికంగా అనేక అంశాల్లో చాలా మార్పులు వచ్చాయన్నారు. కానీ ఇండియా-రష్యా మధ్య స్నేహం పటిష్టంగానే ఉందన్నారు. నిజమైన స్నేహానికి ఇది వాస్తవిక రూపమన్నారు మోదీ. మేక్ ఇన్ ఇండియా కింద అభివృద్ధి, రక్షణ రంగంలో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్నాయని తెలిపారు మోదీ.
ఆర్థికరంగంలోను భారత్-రష్యా పరస్పరం సహకారాన్నిఅందిపుచ్చుకుంటామని మారుతున్న ప్రపంచ రాజకీయాలను ప్రస్తావించిన మోదీ.. ఎన్ని మార్పులు వస్తున్నా ఇరు దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయని స్పష్టంచేశారు. రెండు దేశాలు చాలా సవాళ్లను ఎదుర్కొన్నాయి. అంతరిక్షం, అణు రంగాలలో సహకారంతో ఇండియా, రష్యాలు మరింత దగ్గరవుతున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
అనంతరం ప్రసంగించిన పుతిన్...భారత్తో రష్యాకు చిరకాల బంధమని కొనియాడారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు పెరుగుతున్నాయన్న రష్యా అధ్యక్షుడు.. ఉగ్రవాదం గురించి తాము ఆందోళన చెందుతున్నామని తెలిపారు. ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు పుతిన్.సైనిక-సాంకేతిక సహకారంపై ఇండియా-రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ ఫ్రేమ్వర్క్ కింద రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రష్యా కౌంటర్ సెర్గీ షోయ్గుతో చర్చలు జరిపి సంతకాలు చేశారు.
ఇరుదేశాలు నాలుగు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. యూపీలోని అమోథీలో ఐదువేల కోట్లతో.. ఏర్పాటు చేసిన ఆయుధ కర్మాగారంలో ఆరు లక్షల ఏకే 203 తుపాకులు, కలష్నికోవ్ ఆయుధాల్లో చిన్నఆయుధాల ఉత్పత్తి, వచ్చే పదేళ్లకు సైనిక సహకారం వంటి అంశాలపై మంత్రులు సంతకాలు చేశారు. రాజ్నాథ్సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్లు, రష్యా రక్షణమంత్రి జనరల్ సెర్గే షోయ్గూ, ఆ దేశ విదేశాంగ మంత్రి సెహర్గీ లావ్రోవ్తో తొలిసారి ఉమ్మడి భేటీ జరిగింది.