Pakistan: పాక్లో ఆందోళనలు.. ఇస్లామాబాద్, రావల్పిండిలలో ఇంటర్నెట్ కట్
పంజాబ్ ప్రావిన్స్ అంతటా 10 రోజుల పాటు 144 సెక్షన్
పాకిస్థాన్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా తెహ్రీక్-ఏ-లబ్బైక్ పాకిస్థాన్ (టీఎల్పీ) అనే మతతత్వ పార్టీ తలపెట్టిన భారీ ర్యాలీ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. శుక్రవారం జరగనున్న 'లబ్బైక్ యా అక్సా మిలియన్ మార్చ్' కారణంగా రాజధాని ఇస్లామాబాద్, రావల్పిండి నగరాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిరవధికంగా నిలిపివేశారు.
ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా, రాజధానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను మూసివేసి దిగ్బంధించారు. నగరంలోని రెడ్ జోన్ను పూర్తిగా సీల్ చేసి, కేవలం అధికారిక పాసులు ఉన్నవారిని మాత్రమే మార్గల్లా రోడ్డు మీదుగా అనుమతిస్తున్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రి మోహ్సిన్ నఖ్వీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. దీంతోపాటు, పంజాబ్ ప్రావిన్స్ వ్యాప్తంగా 10 రోజుల పాటు 144 సెక్షన్ను అమలు చేశారు. దీని ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో నలుగురి కంటే ఎక్కువ మంది గుమికూడటంపై నిషేధం విధించారు.
ఈ ర్యాలీకి ముందే లాహోర్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. టీఎల్పీ చీఫ్ సాద్ హుస్సేన్ రిజ్వీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు బుధవారం రాత్రి వారి ప్రధాన కార్యాలయంపై దాడి చేశారు. దీంతో టీఎల్పీ కార్యకర్తలు రాళ్లు, ఇనుప రాడ్లతో పోలీసులపై ఎదురుదాడికి దిగారు. ఈ ఘర్షణల్లో ఐదుగురు పోలీసులు, పదుల సంఖ్యలో ఆందోళనకారులు గాయపడినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అయితే, తమ కార్యకర్త ఒకరు మరణించగా, 20 మందికి గాయాలయ్యాయని టీఎల్పీ వర్గాలు ఆరోపించాయి.
ప్రభుత్వ చర్యలను టీఎల్పీ తీవ్రంగా ఖండించింది. "శాంతియుతంగా తలపెట్టిన మా ర్యాలీని అడ్డుకోవడానికి ప్రభుత్వం నీచమైన చర్యలకు పాల్పడుతోంది. గాజాలో యూదులు ముస్లింలను అణచివేస్తుంటే, ఇక్కడ వారికి మద్దతిచ్చే వారు మమ్మల్ని అణచివేస్తున్నారు" అని టీఎల్పీ ప్రతినిధి ఆరోపించారు. పాలస్తీనాకు మద్దతు తెలపడం పాకిస్థాన్లో నేరంగా మారిందని ఆయన విమర్శించారు. నిర్బంధాలను ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రస్తుతం లాహోర్లోని టీఎల్పీ ప్రధాన కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. పరిస్థితి అదుపు తప్పితే పారామిలటరీ దళాలైన రేంజర్లను రంగంలోకి దించాలని పంజాబ్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.