Pak Cyber Attack: భారత్పై సైబర్ దాడికి పాక్ హ్యాకర్ల యత్నాలు
డ్యాన్స్ ఆఫ్ హిల్లరీ అనే వైరస్ను వ్యాప్తి చేసేందుకు ప్రయత్నం..;
పాకిస్తాన్ సోషల్ మీడియా వేదికల ద్వారా భారత్పై సైబర్ దాడికి ప్రయత్నిస్తోందని ఇంటలిజెన్స్ వర్గాలు కనిపెట్టాయి. వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రాం, ఈ-మెయిల్ల ద్వారా ‘డ్యాన్స్ ఆఫ్ హిల్లరీ’ అనే ప్రమాదకరమైన వైరస్ను వ్యాప్తి చేసేందుకు ట్రై చేస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని నిఘా వర్గాలు సూచించాయి. అయితే, పాకిస్తాన్ హ్యాకర్లు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ వైరస్ను డెవలప్ చేసినట్లు తెలుస్తుంది. సున్నితమైన సమాచారం, ఆర్థిక డేటాను చోరి చేసే ఈ మాల్వేర్ను వీడియోలు, పీడీఎఫ్ ఫైల్స్ రూపంలో పంపిస్తుందని పేర్కొనింది.
అయితే, ఈ వైరస్ ఒక్కసారి యాక్టివేట్ అయిందంటే మొబైల్, కంప్యూటర్లను తీవ్రంగా దెబ్బ తీస్తుంది అని భాతర నిఘా వర్గాలు తెలిపాయి. బ్యాంక్ సమాచారం, పాస్వర్డ్ సహా రహస్య డేటాను హ్యాకర్లు చేజిక్కించుకునే ప్రమాదం ఉందని భద్రతా నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ‘.exe’, “tasksche.exe’ లాంటి అనుమానాస్పద పేర్లతో ఉన్న ఫైళ్లలో ఈ వైరస్ ఎక్కువగా ఉంటోందని సైబర్ నిపుణులు తెలియజేస్తున్నారు.
కాగా, ఈ ఫైళ్లు సాధారణంగానే కనిపించినా, చాలా ప్రమాదకరమైనవని, ఒకసారి క్లిక్ చేస్తే.. ఆ తర్వాత అవి హ్యాకర్లు కంట్రోల్ చేసుకోవడానికి యాక్సెస్ను ఇచ్చేస్తాయని చెప్పుకొచ్చారు. డిజిటల్ అవాంతరాలను కల్పించడమే ఈ దాడుల ముఖ్య ఉద్దేశం అంటున్నారు. ఈ నేపథ్యంలో హానికరమైన కంటెంట్, సోషల్ మీడియాను నిశితంగా పర్యవేక్షించాలని రాష్ట్రాల సైబర్ సెల్లను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.