Pakistan: భద్రతా మండలిలో పాక్ మంకుపట్టు..
ఉగ్రవాద ఆంక్షల కమిటీ పగ్గాలను పాక్ దక్కించుకోవడంతో సభ్య దేశాలు అభ్యంతరం..;
ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన పాకిస్థాన్కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో టెర్రర్ నిరోధక కమిటీకి వైస్ ఛైర్మన్ హోదాను కట్టబెట్టడం ప్రస్తుతం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఇస్లామాబాద్కు తాలిబాన్ల ఆంక్షల కమిటీ బాధ్యతలను అప్పగించడంపై ప్రపంచ దేశాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇక, భద్రతా మండలి తీసుకున్న ఈ నిర్ణయాన్ని కౌన్సిల్లోని మిగిలిన సభ్యులు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. జనవరిలో జరగాల్సిన ఐక్యరాజ్య సమితి కమిటీల కేటాయింపు ప్రక్రియ కేవలం పాకిస్తాన్ డిమాండ్లపై ఏకాభిప్రాయం లేకపోవడంతోనే గత ఐదు నెలలు ఆలస్యమైందని అధికారులు తెలిపారు.
కాగా, పాకిస్తాన్ మంకుపట్టు, అహేతుక డిమాండ్లపై భద్రతా మండలిలోని ఇతర సభ్యులు విసిగి పోయారని యూఎన్ అధికారులు చెప్పుకొచ్చారు. దీంతో ఉగ్రవాదంపై భారత్ను లక్ష్యంగా చేసే పాక్ ప్రయత్నాలకు ఇతర సభ్యులు సపోర్టు పలికేందుకు రెడీగా లేనట్లు సమాచారం. యూఎన్ఎస్సీ శాశ్వత సభ్యులు చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, అమెరికా ఏ కమిటీకీ కూడా నాయకత్వం వహించడానికి ఇష్టపడలేదు.. ఎందుకంటే ఆ దేశాలకు హోదాలతో పని లేదని పేర్కొన్నారు. ఈ దేశాలన్నీ ఏకాభిప్రాయంతో పని చేస్తాయని అధికారులు చెప్పుకొచ్చారు. అయితే, పాక్కు కేటాయించిన స్థానం అంత ముఖ్యమైనది కాదు.. కేవలం నామమాత్రం అయిందేనన్నారు. కానీ, ఉగ్రవాద ఆంక్షల కమిటీ పగ్గాలను దక్కించుకోవడం వల్ల ఇస్లామాబాద్, కాబుల్ మధ్య అభిప్రాయ భేదాలు తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు.
ఇక, తొలుత భద్రతా మండలిలోని ఆంక్షల కమిటీ, (నాన్-ప్రొలిఫరేషన్) ఆంక్షల కమిటీ, తాలిబాన్ కమిటీ, ఉగ్రవాద నిరోధక కమిటీల అధ్యక్ష పదవులను పాకిస్తాన్ డిమాండ్ చేయగా.. యూఎన్ఎసీ ఆ దేశానికి తాలిబాన్ కమిటీతో పాటు ఉగ్రవాద నిరోధక కమిటీకి వైస్ ఛైర్మన్ హోదాలను మాత్రమే కట్టబెట్టింది. పాక్ ఉగ్రవాదానికి అడ్డా అనేది అందరికి తెలిసిన విషయం.. ప్రపంచవ్యాప్తంగా 850 మంది వ్యక్తులను, సంస్థలను ఐరాస భద్రతా మండలి ఉగ్ర జాబితాలో చేర్చగా.. అందులో 146 మంది పాకిస్తానీయులే ఉన్నారు. 2008 ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్, జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్ లాంటి ఎంతో మంది టెర్రరిస్టులు పాకిస్తాన్ లోనే ఆశ్రయం పొందుతున్నారు.