Pope Francis Funeral Rites: వాటికన్ సిటీలో సాదాసీదాగా పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు
పోప్ అంత్యక్రియల్లో ద్రౌపదీ ముర్ము, ట్రంప్, జెలెన్ స్కీ సహా 2 లక్షల మంది హాజరు;
పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు శనివారం వాటికన్ సిటీలో సాదాసీదాగా ముగిశాయి. చెక్కతో చేసిన శవపేటికలో ఉంచిన పోప్ భౌతిక కాయాన్ని ఖైదీలు, వలసదారులు ఖననం చేశారు. అత్యంత సీనియర్ కార్డినల్స్ సమక్షంలో సెయింట్ మేరీ బాసిల్లికా చర్చి ఆవరణలో పోప్ను ఖననం చేసినట్టు వాటికన్ వర్గాలు తెలిపాయి. అంత్యక్రియలకు ముందు పోప్ దేహంపై తెల్లటి వస్ర్తాన్ని, నాణేలు ఉన్న సంచిని, ఆయన పోప్గా ఉన్నప్పటి రికార్డ్ (రోజిటో)ను శవపేటిక లోపల పెట్టారు. పోప్ అంతిమ సంస్కారాల్లో పలువురు ప్రపంచ దేశాధినేతలు సహా రెండు లక్షల మంది ప్రజలు పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, బ్రిటన్ ప్రధాని స్టార్మర్ పోప్కు శ్రద్ధాంజలి ఘటించారు.
అయితే అంత్యక్రియలకు ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెయింట్ పీటర్స్ బసిలికాలో సమావేశమైనట్లు అధికారులు తెలిపారు. 15 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశాన్ని వైట్ హౌస్ ఫలవంతమైన చర్చలుగా అభివర్ణించింది. ట్రంప్, జెలెన్ స్కీ.. కీలక భేటీలో యుద్ధం ముగింపు, ఖనిజాల ఒప్పందం వంటి అంశాలపై వీరు చర్చించినినట్లు అధ్యక్ష కార్యాలయాలు వెల్లడించాయి.అమెరికాలోని ఓవల్ కార్యాలయంలో ఇటీవల వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ సంఘటన అనంతరం వీరిద్దరు కలుసుకోవడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ యుద్ధంపై వారంలోపే ఓ ఒప్పందం కుదురుతుందని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ సమావేశం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
పోప్ అంత్యక్రియల కార్యక్రమంలో వీరిద్దరూ పక్కపక్కన కాకుండా వేర్వేరు చోట్ల కూర్చోవడంతో, వారి మధ్య ఇంకా మనస్పర్థలు ఉన్నాయన్న ఊహాగానాలకు వెలువడ్డాయి. వీటిపై వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చియుంగ్ స్పందిస్తూ, కార్యక్రమానికి హాజరైన దేశాల ప్రతినిధులకు ఫ్రెంచ్ అక్షర క్రమంలో సీటింగ్ ఏర్పాటు చేశారని, అంతకు మించి మరే ఇతర కారణం లేదని క్లారిటీ ఇచ్చారు.