ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. కీవ్ సంఘర్షణకు ముగింపు పలికేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఇందుకోసం చర్చలకు సముఖమని, అయితే ఉక్రె యిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో మాత్రం మాట్లాడబోమని తేల్చిచెప్పారు. ఈ చర్చలకు ఎలాంటి ముందస్తు షరతులు కూడా పెట్టబోమని పుతిన్ స్పష్టం చేశారు. ఆ దేశ పార్లమెంటుతో మాత్రమే చర్చలు జరుపుతామని చెప్పారు. కాగా, ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడ్డాయని తెలి పారు. జెలెన్ స్కీని తాము చట్టబద్ధ అధ్యక్షుడిగా చూడటం లేదన్నారు.
పుతిన్ నాలుగున్నర గంటల పాటు సాగిన వార్షిక విలేకరుల సమావేశంలో వివిధ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఉక్రెయిన్తో యుద్ధంలో తాము విజయానికి చేరువలో ఉన్నామని తెలిపారు. తమ దళాలు రోజుకొక కిలోమీటర్ భూభాగాన్ని ఆక్రమిస్తూనే ఉన్నామని అన్నారు. తాము చేపట్టిన ప్రత్యేక సైనిక ఆపరేషన్ విజయవంతం అవుతోందని పేర్కొన్నారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్తో నాలుగేళ్లుగా తాను మాట్లాడలేదని అయితే ఆయన్ను కలవడానికి సిద్ధంగా ఉన్నానని పుతిన్ చెప్పారు. అంతకుముందు అగ్రరాజ్యా నికి కాబోయే అధ్యక్షుడిపై రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు కురిపించారు. ఆయన తెలివైన రాజకీయ నేత అని అన్నారు.
అయితే, ఇటీవల ఆయన పై జరిగిన హత్యాయత్నాలు దిగ్భ్రాంతి కలిగించాయన్న పుతిన్, ప్రస్తుతం ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఎన్నికల ప్రచారంలో జరిగిన ఘటనలను గుర్తుచేసుకున్నారు. నా ఆలోచన ప్రకారం ఇప్పుడు ట్రంప్ ఏమాత్రం సురక్షితంగా లేరు. అయితే ఆయన తెలివైన వ్యక్తి. ముప్పును అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉంటారని విశ్వసిస్తున్నా అని పుతిన్ తెలిపారు.