Online Love: ప్రేమ కోసం దేశం దాటాడు కానీ ..
పెళ్లికి నో చెప్పిన ప్రేయసి, పాక్ జైల్లో యూపీ వ్యక్తి;
ప్రేమ వ్యవహారం సరిహద్దులు దాటించింది. ఉత్తర్ ప్రదేశ్ అలీఘఢ్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల బాదల్ బాబు అనే వ్యక్తి తన ప్రియురాలిని కలిసేందుకు పాకిస్తాన్ వెళ్లిన వార్త వైరల్ అయింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇండియా పాకిస్తాన్ సరిహద్దును దాటి దాయాది దేశంలోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలోనే అక్కడి పోలీసులు బాబుని అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అతడి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
దేశం దాటి ప్రవహించే తన ప్రేమ కోసం బాబు పెద్ద నాటకమే ఆడాడు. ఏడాది ఆగస్ట్లో పని కోసం ఢిల్లీ వెళ్తున్నట్లు తన కుటుంబానికి బాబు చెప్పాడు. దీపావళికి ముందు తన కుటుంబానికి వీడియో కాల్ చేశాడు. తాను క్షేమంగా ఉన్నానని, పని కుదిరిందని తెలిపాడు. మొబైల్ ఫోన్ కొనే స్థోమత లేకపోవడంతో స్నేహితుల ఫోన్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ చేసినట్లు చెప్పాడు. కానీ నిజానికి పాకిస్తాన్కి చెందిన సనా రాణికి బాదల్ బాబులో ఆన్లైన్ స్నేహం కుదిరింది. తన ఫేస్బుక్ ఫ్రెండ్ని కలవడానికి సరిహద్దు దాటి, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులోని బహౌద్దీన్ జిల్లాలోకి అక్రమంగా ప్రవేశించాడు. రాణి దగ్గరికి వెళ్లి ఆమెను కలుసుకున్నాడు. పెళ్లి చేసుకుందామని చెప్పగా ఆ ప్రియురాలు నిరాకరించింది.
బాబు అక్రమ ప్రవేశం గురించి తెలుసుకున్న పాకిస్థాన్ పోలీసులు డిసెంబర్ 28న అతడ్ని అరెస్ట్ చేశారు. సనాతోపాటు ఆమె కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. బాబుతో ప్రేమ వ్యవహారం గురించి ఆరా తీశారు. ఆన్లైన్లో ప్రేమించుకున్నామని, అయితే అతడ్ని పెళ్లాడటం తనకు ఇష్టం లేదని ఆమె చెప్పింది.మరోవైపు బాబుపై పాకిస్థాన్ ఫారిన్ యాక్ట్ సెక్షన్ 13, 14 కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అరెస్ట్ చేసిన బాబును కోర్టులో ప్రవేశపెట్టగా జనవరి 10 వరకు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో అతడ్ని జైలుకు తరలించారు.
మరోవైపు బాదల్ బాబు పాకిస్థాన్లో అరెస్టైనట్లు తెలుసుకుని ఉత్తరప్రదేశ్లోని అతడి కుటుంబం షాక్ అయ్యింది. అతడి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని కోరారు. పాకిస్థాన్ ప్రభుత్వంతో చర్చించి తమ కుమారుడ్ని విడిపించాలని మొరపెట్టుకున్నారు. ఈ మేరకు వినతి పత్రాన్ని అలీగఢ్ ఎస్పీకి సమర్పించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఈ విషయాన్ని తెలియజేస్తానని ఆయన వెల్లడించారు.