Tahawwur Rana: తహవూర్ రాణా పిటిషన్ను తిరస్కరించిన అమెరికా న్యాయస్థానం
భారత్కు అప్పగిస్తే చిత్రహింసలు పెడతారంటూ పిటిషన్;
తనను భారత్కు అప్పగించడంపై అత్యవసరంగా స్టే విధించాలని 2008 ముంబై ఉగ్ర దాడుల నిందితుడు తహవుర్ రాణా అమెరికా సుప్రీంకోర్టును కోరాడు. తన జాతి, మత, సామాజిక గుర్తింపు కారణంగా భారతదేశంలో తనను చిత్రహింసలు పెట్టి చంపేస్తారంటూ అతను తన పిటిషన్లో ఆరోపించాడు. తాను పాకిస్థానీ సంతతికి చెందిన ముస్లింనని, తాను పాకిస్థానీ సైన్యానికి చెందిన మాజీ సభ్యుడినని అతను తెలిపాడు. ఈ కారణంగానే కస్టడీలో తనను చిత్రహింసలు పెడతారని అనుమానించవలసి వస్తోందని, తనను ప్రమాదకర పరిస్థితిలోకి నెట్టవద్దని కోర్టును అభ్యర్థించాడు.
ప్రాణాంతక జబ్బులతో పోరాడుతున్న తనను భారత్కు అప్పగించడమంటే మరణశిక్ష విధించడమేనని పేర్కొన్నాడు. తన అప్పగింత అమెరికా చట్టాలతో పాటు ఐరాస తీర్పుల ఉల్లంఘనే అని తెలిపాడు. ఈ నేపథ్యంలో అప్పగింతపై స్టే విధించాలని తహవూర్ పిటిషన్ పేర్కొన్నాడు. అయినా కూడా అమెరికా కోర్టు స్టే ఇచ్చేందుకు అంగీకరించలేదు. భారత్కు అప్పగించవద్దంటూ వేసిన పిటిషన్ను ధర్మాసనం తిరస్కరించింది. రాణా.. ప్రస్తుతం లాస్ఏంజెలెస్లోని మెట్రోపాలిటన్ జైల్లో ఉన్నాడు. పాక్–అమెరికా ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీతో అతనికి దగ్గరి సంబంధాలున్నాయి.