Iran-US: ఇరాన్పై అమెరికా భీకర దాడులు, 16 బోట్లు ధ్వంసం
వీడియో విడుదల చేసిన అమెరికా
ఇరాన్పై అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా హార్ముజ్ జలసంధిలో తిష్ట వేసిన 16 ఇరానియన్ మైన్-లేయింగ్ బోట్లను అమెరికా ధ్వంసం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను అమెరికా విడుదల చేసింది.
గత నెల 28 నుంచి జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ కొరత ఏర్పడింది. ఇప్పటికే ఆయా దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గేలా కనిపించడం లేదు. ఇరాన్-అమెరికా మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. హెచ్చరికలు, వార్నింగ్లు పరస్పరం జరుగుతున్నాయి.
హార్ముజ్ జలసంధిలో చమురు ఎగుమతులను అడ్డుకుంటామని.. శత్రువులకు ఒక లీటర్ చమురుగా కూడా రవాణా చేయబోనివ్వమని ఇరాన్ ప్రతిజ్ఞ చేసింది. ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధిలో బాంబులతో తిష్ట వేసిన 16 మైన్-లేయింగ్ బోట్లను లక్ష్యంగా చేసుకుని అమెరికా పేల్చేసింది. అయితే జలసంధిలో పేలుడు పదార్థాలు అమర్చినట్లుగా ఎటువంటి సమాచారం లేదని. . ప్రస్తుతం 20 శాతం చమురు రవాణా అవుతుందని ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొ్న్నారు. ఒకవేళ ఏవైనా మందుపాతరలు అమర్చితే మాత్రం మునుపెన్నడూ చూడని విధంగా ఇరాన్పై దాడి చేస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా అమెరికా రక్షణ కార్యదర్శి హీట్ హెగ్సేత్ కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటి వరకు చూడని అత్యంత తీవ్రమైన దాడులు చేస్తామని సూచించారు. తమ సైనికులకు స్వల్ప గాయాలు అయినట్లుగా పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే మరోవైపు లెబనాన్పై కూడా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. దక్షిణ లెబనాన్ అంతటా ఇజ్రాయెల్ జరిపిన బహుళ దాడుల్లో ఏడుగురు మరణించారని లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. అలాగే రెడ్ క్రాస్ సభ్యుడు కూడా ఒకరు మరణించినట్లు వెల్లడించింది.
ఇదిలా ఉంటే ఇరాన్లో అమెరికా దళాలు 5,000 కంటే ఎక్కువ లక్ష్యాలను ఛేదించాయని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ తెలిపారు. ఈ యుద్ధంలో దాదాపు 140 మంది అమెరికా సర్వీస్ సభ్యులు గాయపడ్డారని.. ఎక్కువ మందికి స్వల్ప గాయాలే అయ్యాయని, 108 మంది సర్వీస్ సభ్యులు ఇప్పటికే విధుల్లో చేరారని పెంటగాన్ తెలిపింది. ఎనిమిది మంది యూఎస్ సర్వీస్ సభ్యులు తీవ్ర గాయాల పాలయ్యారని.. ఏడుగురు మరణించారని పేర్కొంది. ఇక ఇరాన్లో కనీసం 1,230 మంది మరణించగా.. లెబనాన్లో 480 మందికి పైగా, ఇజ్రాయెల్లో 12 మంది మరణించారని అధికారులు తెలిపారు.