Baltimore Bridge Collapse: బాల్టిమోర్‌ వంతెన విధ్వంస ఘటన..సింగ్‌పూర్ సంస్థపై 100 మిలియన్ డాలర్లకు దావా

తగ్గించమని కోరుతున్న నౌక యాజమాన్యం;

Update: 2024-09-20 04:45 GMT

అమెరికాలోని బాల్టిమోర్‌లో నౌక ఢీకొనడంతో ఓ వంతెన కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఈ ఘటనపై అమెరికా న్యాయశాఖ దావా వేసింది. 100 మిలియన్ల డాలర్లు (రూ.837 కోట్లు) చెల్లించాలని సింగపూర్‌కు చెందిన కార్గో షిప్ యాజమాన్యంపై వేసిన దావాలో పేర్కొంది.

‘‘బాల్టిమోర్‌లో వంతెనకు వాటిల్లిన నష్టం, నౌకాశ్రయాన్ని తిరిగి తెరవడానికి అయిన ఖర్చులకు పన్ను చెల్లింపుదారుల డబ్బును కాకుండా ఈ ఘటనకు కారణమైన సంస్థల నుంచి పొందేలా యూఎస్ న్యాయశాఖ పని చేస్తోంది. దానిలో భాగంగానే ఈ దావా వేశాం. ఈ ఘటనకు కారకుల్ని జవాబుదారీగా చేసేందుకు కట్టుబడి ఉన్నాం. సదరు సంస్థల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణం’’ అని యూఎస్ అటార్నీ జనరల్ మెర్రిక్ గార్లాండ్ ఓ ప్రకటనలో తెలిపారు. సింగపూర్‌కు చెందిన గ్రేస్ ఓషన్ ప్రైవేట్‌, సినర్జీ మెరైన్ ప్రైవేట్‌ సంస్థలపై ఈ దావా పడింది. ఆ నష్ట పరిహారం మొత్తాన్ని 44 మిలియన్ల డాలర్లకు కుదించాలని ఆ సంస్థలు కోరుతున్నాయి.

వంతెనను ఢీకొట్టిన నౌకలోని విద్యుత్, మెకానికల్ వ్యవస్థ నిర్వహణ సక్రమంగా లేవని దావాలో పేర్కొన్నారు. ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్‌పై సపోర్ట్ కాలమ్‌ను కొట్టే ముందు నౌకలో విద్యుత్ సరఫరా ఆగిపోయిందని ఆరోపించారు. ఇది కేవలం యాజమాన్యం తప్పిదమేనని; నౌక నిర్వహణ సక్రమంగా ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదన్నారు. సింగపూర్‌కు చెందిన నౌక యాజమాన్యం గ్రేస్ ఓషన్ ప్రైవేట్‌, సినర్జీ మెరైన్ ప్రైవేట్‌ సంస్థలపై ఈ దావా వేసింది. అయితే, దీనిపై స్పందించిన ఆ సంస్థలు నష్ట పరిహారం తగ్గించాలని అభ్యర్థిస్తున్నాయి. ఈ మొత్తాన్ని 44 మిలియన్ల డాలర్లకు కుదించాలని కోరుతున్నాయి.

నౌక ఢీకొనడంతో పటాప్‌స్కో నదిపై ఉన్న ఫ్రాన్సిస్‌ స్కాట్‌ కీ వంతెన మొత్తం కుప్పకూలింది. స్థానిక కాలమానం ప్రకారం.. మార్చి 25న అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఆ సమయంలో నౌకలో ఉన్న భారత సిబ్బంది.. అధికారులను అప్రమత్తం చేయడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందడంతో వంతెనపై రాకపోకలను నిలిపేశారు. ఈ ఘటనను మేరీల్యాండ్ గవర్నర్ ‘జాతీయ ఆర్థిక విపత్తు’గా అభివర్ణించారు. అమెరికాలో అత్యంత రద్దీగా ఉండే పోర్టుల్లో ఒకటైన బాల్టిమోర్‌లో నెలల తరబడి కార్యకలాపాలు నిలిచిపోయాయి.

ఘటన తర్వాత బ్రిడ్జి శకలాలను తొలగించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు. వెయ్యి టన్నుల బరువులను ఎత్తగల భారీ క్రేన్‌ సాయంతో శిథిలాలను తొలగించడానికి పది రోజులు పట్టింది. వంతెనను ఢీకొట్టిన నౌకపైన 3 నుంచి 4 వేల టన్నుల బరువైన శకలాలు పడటంతో అది అక్కడే చిక్కుకుపోయింది. దాదాపు ఈఫిల్‌ టవర్‌ అంత పొడవైన ఆ భారీ నౌకను అక్కడ నుంచి తరలించడానికి నానా తంటాలు పడ్డారు.

Tags:    

Similar News