తారకరత్న ఆరోగ్యం విషమం.. కొనసాగుతున్న అత్యవసర చికిత్స
నందమూరి తారకరత్నకు అత్యవసర చికిత్స కొనసాగిస్తున్నారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యలు తారకరత్నకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. నిపుణుల వైద్య బృందం ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని మానిటరింగ్ చేస్తోంది. తారకరత్న మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ కారణంగా తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారని వైద్యులు వెల్లడించారు. ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందన్నారు. అత్యవసర చికిత్స పొందుతున్న తారకరత్నను చూసేందుకు కుటుంబ సభ్యులు ఒకొక్కరుగా బెంగళూరు చేరుకుంటున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్ కుటుంబ సమేతంగా బెంగళూరు వెళ్లారు.
శనివారం సాయంత్రం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తారకరత్న తండ్రి మోహనకృష్ణ, భార్య అలేఖ్యతో మాట్లాడారు . తారకరత్న ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని, కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని చంద్రబాబు వెల్లడించారు. త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. దగ్గుబాటి పురందేశ్వరి, నందమూరి సుహసిని, ఎమ్మెల్యే చినరాజప్ప, పలువురు టీడీపీ నేతలు నారాయణ హృదయాలయకు వెళ్లారు. అటు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బాలకృష్ణ ట్వీట్ చేశారు. భగవంతుడి ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులతో మన తారకరత్న కోలుకుంటున్నారని బాలయ్య తెలిపారు
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com