AP : వేడెక్కిన పలాస రాజకీయం

శ్రీకాకుళం జిల్లా పలాసలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష నేతల సెల్ఫీ ఛాలెంజ్లతో పొలిటికల్ హీట్ పెరిగింది. మంత్రి అప్పలరాజు, పలాస టీడీపీ ఇన్ఛార్జ్ గౌతు శిరీష మధ్య డైలాగ్ వార్ కొనసాగుతుంది. పలాస నియోజకవర్గ అభివృద్ధిపై మాటల తూటాలు పేల్చుతున్నారు. నియోజకవర్గంలో నువ్వేం చేశావంటే నువ్వేం చేశావంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. నిర్మాణంలో ఉన్న ఉద్దానం కిడ్ని సెంటర్ వద్ద జగన్ మాస్క్తో అప్పలరాజు సెల్ఫీ తీసుకున్నారు. ఇక అభివృద్ధిపై చర్చకు రావాలంటూ అప్పలరాజు సవాల్ విసిరారు.
మంత్రి అప్పలరాజుకు అంతే స్ట్రాంగ్గా గౌతు శిరీష కౌంటర్ ఇచ్చారు. ఉద్దానంలో ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో చర్చించుకుందాం అంటూ గౌతు శిరీష ప్రతి సవాల్ విసిరారు. ఇక పలాసలోని టిడ్కో ఇళ్ల వద్ద గౌతు శిరీష సెల్ఫీ తీసుకుని ఛాలెంజ్ విసిరారు. ప్రజలపై రూపాయి భారం వేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు లక్షలాది ఇళ్లు నిర్మించారని గుర్తు చేశారు. అయితే పూర్తి అయిన ఇళ్లను పేదలకు ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం జగన్దేనని గౌతు శిరీష మండిపడ్డారు. టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులు వేయడం తప్పా జగన్ చేసిందేమీ లేదన్నారు. ఇక అప్పలరాజుకు దమ్ముంటే కిడ్నీ రిసెర్చ్ సెంటర్ పనులు పూర్తి చేసి వైద్యులను నియమించాలన్నారు. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం టీడీపీ హయాంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు గౌతు శిరీష.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com