AP : పోలవరం ప్రాజెక్టుపై తుది నిర్ణయం, మార్చి 5 న సమావేశం

AP : పోలవరం ప్రాజెక్టుపై తుది నిర్ణయం, మార్చి 5 న సమావేశం
డ్యాంకు సంబంధించిన అంశాలు చర్చించి, అధ్యయనం చేసి ఆకృతులకు, ఇతరత్రా సాంకేతికంగా ముందుకు సాగేందుకు నిర్ణయాలు తీసుకునేందుకు సమావేశం జరుగనుంది

పోలవరం ప్రాజెక్టుపై తుది నిర్ణయం తీసుకునే సమావేశం జరగబోతోంది. ఈ డ్యాంకు సంబంధించిన అంశాలు చర్చించి, అధ్యయనం చేసి ఆకృతులకు, ఇతరత్రా సాంకేతికంగా ముందుకు సాగేందుకు నిర్ణయాలు తీసుకునేందుకు ఈ నెల 5న సమావేశం జరుగనుంది. ప్రాజెక్టు అథారిటీ ముఖ్యులు, కేంద్ర జలసంఘం ప్రతినిధులు, జలవిద్యుత్తు పరి శోధన సంస్థ, మట్టి పరిశోధనా కేంద్రం, ఐఐటీ ఢిల్లీ, తిరుపతి నిపుణులు కూడా ఈ సమావేశంలో హాజరుకానున్నారు.

ఈ సమావేశంలో ప్రధాన డ్యాం నిర్మాణానికి ఎంతో కీలకమైన డయాఫ్రం వాల్‌ భవితవ్యం తేలే అవకాశముంది. జాతీయ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ ప్రతినిధులు ఇప్పటికే వీలైనంత మేర డయాఫ్రం వాల్‌ సామర్థ్యం తేల్చే పరీక్షలు పూర్తి చేశా రు. వారు తమ నివేదికను తీసుకొని నేరుగా సమావేశానికి హాజరుకానున్నారు. ప్రజంటేషన్‌ కూడా ఇచ్చే అవకాశం ఉంది. వారి నివేదిక ఆధారంగా డయాఫ్రం వాల్‌ ధ్వంసమైనంత మేర నిర్మించడమా? లేక మళ్లీ కొత్తది పూర్తిగా నిర్మించడమా అన్న అంశాలపై చర్చించనున్నారు. అలాగే జాతీయ జల విద్యుత్తు పరిశోధన సంస్థ ప్రతినిధులు ఇచ్చే నివేదికపై కూడా చర్చించనున్నారు.

ప్రధాన డ్యాం నిర్మించాల్సిన ప్రాంతంలో భారీ వరదలతో నదీ గర్భంలో ఇసుక బాగా కోసుకుపోయింది. కోత పడిన ప్రాంతంలో తీసుకోవాల్సిన చర్యలపైనా నిర్ణయాలు ఉంటాయి. అలాగే నదీ మార్గాన్ని స్పిల్‌ వే వైపు మళ్లించేందుకు అప్రోచ్‌ ఛానల్‌ తవ్వుతున్నారు. ఈ క్రమంలో అధ్యయనాలు, పరిశీలనలో తేలిన సాంకేతిక అంశాలపై చర్చిస్తారు. మొత్తానికి పోలవరం భవితవ్యం ఈ సమావేశంతో తేలిపోనుంది.

Tags

Read MoreRead Less
Next Story