AP: ప్రజా రాజధానికి కొత్త ఊపిరి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పునఃప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసి కీలక అడుగు వేసింది. కేంద్రం ఇటీవల విడుదల చేసిన రూ.4200 కోట్ల నిధులు అమరావతి నిర్మాణానికి ఊతమిచ్చే విధంగా మారాయి. ఈ నిధుల విడుదలలో ప్రపంచ బ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మద్దతు కీలకంగా నిలిచినట్లు సమాచారం. గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలకు ఇది ప్రాణవాయువు లాంటిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
చంద్రబాబు చాణక్యం
ఢిల్లీలోని కేంద్ర మంత్రులను పలుమార్లు కలసి, అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులపై వివరాలు సమర్పించి, కేంద్రాన్ని నచ్చజెప్పడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలిదశ నుంచే రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలోకి తీసుకెళ్లాలని ఆయన పట్టుదలతో ఉన్నారు. కేంద్రానికి అమరావతి ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యతను వివరించడంలో ఆయన చురుకుగా వ్యవహరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఈ ప్రక్రియలో ప్రధాన పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఢిల్లీ పర్యటనలు చేయడమే కాకుండా, ముఖ్యమంత్రి కార్యాలయంతో సమన్వయం చేస్తూ అవసరమైన డాక్యుమెంటేషన్ సిద్ధం చేయడంలో సహకరించారు. కూటమి ఎంపీలతో కలిసి పవన్ కల్యాణ్ కేంద్రాన్ని నిధుల విడుదలకు ఒప్పించడంలో తనదైన ముద్రవేశారు. పవన్ కల్యాణ్ కృషిని ప్రశంసిస్తున్నారు.
పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ కు గుడ్ న్యూస్
కేవలం అమరావతికే కాదు, రాష్ట్రంలోని ఇతర ప్రధాన ప్రాజెక్టుల విషయంలో కూడా కేంద్రం సానుకూలంగా స్పందించింది. పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటికే రూ.10,000 కోట్లకు పైగా నిధులు విడుదల కాగా, తాజాగా మరో విడత నిధులు మంజూరు కావడం విశేషం. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాల నేపథ్యంలో, కేంద్రం తన వైఖరిని పునఃపరిశీలిస్తున్నట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com