Andhra Pradesh : పల్నాడులో పందెం రాయుళ్లు

పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో పందెం రాయుళ్లు రెచ్చిపోతున్నారు. సంక్రాంతి అయిపోయినా జోరుగా జూద క్రీడలు నిర్వహిస్తూ అమాయకుల జేబులు కొల్లగొడుతున్నారు. మునమాక, రొంపిచర్ల గ్రామాల్లో పదిహేను ఎకరాల్లో పెద్ద ఎత్తున బరులు ఏర్పాటు చేసి కోడి పందాలు, పేకాట, గుండాటను వైసీపీ కీలక నేతలు ఆడిస్తున్నారు. బరుల వద్దకు వేల సంఖ్యలో పందెంరాయుళ్లు వచ్చి లక్షల రూపాయాలు సమర్పించుకుంటున్నారు.
ప్రత్యర్థుల కంట పడకుండా బరుల చుట్టూ మూడంచెల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి.. నరసరావుపేట, రొంపిచర్ల వైసీపీ కీలక నేతలు జాగ్రత్తలు తీసుకున్నారు. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నా.. జిల్లా పోలీసులు, ప్రభుత్వ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఎస్పీ ఆఫీస్కి కూతవేటు దూరంలో.. నియోజకవర్గ వైసీపీ కీలక నేత కనుసన్నల్లోనే జూద క్రీడలు జరుగుతున్నాయని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూద క్రీడల నిర్వహణపై ఫిర్యాదు చేసినా ఎవరూ చర్యలు తీసుకునే సాహసం కూడా చేయట్లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com