Andhra Pradesh : గన్నవరం సబ్జైలుకు పట్టాభి

టీడీపీ నేత పట్టాభిరాంకు గన్నవరం కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. దీంతో గన్నవరం సబ్జైలుకు తరలించారు పోలీసులు. జీజీహెచ్ వైద్యులు ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ను పరిశీలించిన తర్వాత పట్టాభికి 14రోజుల రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. గన్నవరం సబ్జైలుకు తరలించాలని ఆదేశించారు. శాంతి భద్రతల దృష్ట్యా వేరే జైలుకు తరలించేందుకు అనుమతివ్వాలని పోలీసులు కోరగా.. న్యాయమూర్తి తిరస్కరించారు. ముందస్తు అనుమతి కోరితే పరిశీలిస్తామన్నారు.
పోలీసులు తనను కొట్టారని మంగళవారం న్యాయమూర్తి ఎదుట పట్టాభి చెప్పడంతో.. ఆయనకు వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించారు. వైద్య పరీక్షల తర్వాత తిరిగి తన ఎదుట ప్రవేశ పెట్టాలని చెప్పారు. పోలీసులు పట్టాభికి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మెడికల్ టెస్ట్లు చేయించారు. ఈ రోజు పట్టాభిని కోర్టు ముందు హజరు పరచగా పట్టాభికి 14రోజుల రిమాండ్ విధించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com