Diarrhoea: విజయవాడలో పెరుగుతున్న డయేరియా మృతుల సంఖ్య

విజయవాడలో అతిసార లక్షణాలతో మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మొగల్రాజపురంలో మరో వ్యక్తి చనిపోవడంతో డయేరియా మరణాల సంఖ్య 9కి చేరింది. కలుషిత నీటివల్లే జనం చనిపోతున్నారని అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళనకు దిగారు. మరింత మంది చనిపోకముందే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
విజయవాడలో డయేరియా మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మొగల్రాజపూరానికి చెందిన 60 ఏళ్ల గల్లా కోటేశ్వరరావు అనే వ్యక్తి వాంతులు, విరోచనాలతో మృతిచెందారు. వారం వ్యవధిలోనే అతిసారంతో 9 మంది చనిపోవడం...వందల మంది ఆసుపత్రులపాలవడం స్థానికులను కలవరపరుస్తోంది. విజయవాడలోని అనేక ప్రాంతాల్లో కలుషిత నీటి సమస్య ప్రజల్ని వేధిస్తోందని...మొగల్రాజపురంలో స్థానికులు బాధితులతో కలిసి ధర్నాకు దిగారు. సమస్యను అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. మరింతమంది ప్రాణాలు కోల్పోకముందే...కలుషిత నీటి సమస్యను పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు.
బాధితుల ఆందోళనకు C.P.M. నాయకులు మద్దతు తెలిపారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. డయేరియా మరణాలకు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని అధికారులు చెప్పడం దారుణమన్నారు. నీటిని శుద్ధి చేయకపోవడం వల్లే సమస్య వచ్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పాలకులు స్పందించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com