ఏపీ సర్కార్ కు మరో ఇద్దరు సలహాదారులు

మరో ఇద్దరు సలహాదారులను నియమించింది ఏపీ సర్కార్. మైనారిటీ సంక్షేమ శాఖలో వరుసగా నియామకాలు చేసింది. ఇప్పటికే ఆశాఖలో ఇద్దరు ఉన్నా మరో ఇద్దరు సలహాదారుల నియమించింది.ఈ నెల 18వ తేదీన క్రిస్టియన్ వ్యవహారాల సలహాదారుగా మద్దు బాలస్వామిని, నిన్న మైనారిటీ వ్యవహారాల కోసమంటూ మహమ్మద్ అలీ బాగ్దాదీని నియమించింది. హైకోర్టు మొట్టికాయలు వేసినా,ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నా పట్టించుకోకుండా లేకుండా సలహాదారుల్ని నియమిస్తూనే ఉంది జగన్ సర్కార్. ఇప్పటికే ఈ శాఖలో జియావుద్దీన్, హబీవుల్లాలు సలహాదారులుగా కొనసాగుతున్నారు. ఏ శాఖకు లేని విధంగా ఇంతమంది సలహాదారులను నియమించడంపై ఆ శాఖలోనే తీవ్ర చర్చ నడుస్తోంది.
ఇక మైనారిటీ సంక్షేమశాఖకు ఉన్నతాధికారుల కేటాయింపే తక్కువ. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ. సీఈవో, సీసీఎల్ఏ సంయుక్త కార్యదర్శి పదవిని నిర్వహిస్తున్న అధికారే మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి బాధ్యతల్నీ చూస్తున్నారు.ఆ శాఖకు జగన్ సర్కార్ ప్రాధాన్యం ఇది. మైనారిటీలకు నవరత్నాలు తప్ప సీఎం జగన్ ప్రత్యేకంగా అందిస్తున్న సాయమూ పెద్దగా లేదు. కానీ సలహాదారుల నియామకంలో మాత్రం ఆ శాఖను రాజకీయ పునరావాస కేంద్రంగా ఉపయోగిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
మరోవైపు సలహాదారులకు నెలకు 3.50 లక్షలు జీతం, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. కేబినెట్ హోదానూ కట్టబెట్టారు. గతంలోనే సలహాదారుల నియామకంపై హైకోర్టు ఘాటుగా స్పందించింది. ఉద్యోగులకు టీఏ, డీఏలు ఇచ్చేందుకూ సలహాదారులను నియమిస్తారేమోనని అనుమానం వ్యక్తం చేసింది. ప్రతి దానికీ సలహాదారులను నియమించుకుంటూ పోతే సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు అవుతుందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయినా జగన్ సర్కార్ మొండిగా ముందుకు పోతుందన్న విమర్శలు సొంత పార్టీ నుంచే వస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com