AP: ఇంచు కూడా కదలని బోట్లు

ప్రకాశం బ్యారేజీ వద్ద భారీ బోట్ల తొలగింపు సాధ్యం కాలేదు. ఒక్కో బోటు బరువు 20 టన్నులపైనే ఉండటం.. ఇసుకలో కూరుకుపోవడంతో భారీ క్రేన్లు వినియోగించినా భారీ పడవలు ఇంచు కూడా కదల్లేదు. పడవల తొలగింపులో ప్లాన్-ఏ విఫలం కావడంతో ప్లాన్-బీ అమలు చేయనున్నారు. అడ్డంగా పడిన నాలుగు భారీ బోట్లను ముక్కలుగా కత్తిరించి తొలగించాలని నిర్ణయించారు. దీనికోసం విశాఖ నుంచి అనుభవమున్న డైవింగ్ టీమ్లను రప్పిస్తున్నారు.
తీవ్రంగా ప్రయత్నించినా..
ప్రకాశం బ్యారేజీ వద్ద పడవల తొలగింపు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. 50 టన్నుల బరువు ఎత్తే సామర్థ్యం ఉన్న రెండు భారీ క్రేన్లతో పనులు చేపట్టారు. ఒక్కో బోటు బరువు 20 టన్నులపైనే ఉండటం, బోట్లు ఒకదానితో మరొకటి చిక్కుకుని ఇసుకతో నిండటం వల్ల వచ్చిన ఒత్తిడి కారణంగా కదలని పరిస్థితి ఉన్నట్టు అధికారులు తెలిపారు.
దాదాపు 5 గంటల పాటు నిరంతరాయంగా శ్రమించినా బోట్లు కదలకపోవడంతో పనులు నిలిపేశారు. భారీ పడవల తొలగింపు కోసం ప్లాన్-ఎ విఫలం కావడంతో ప్లాన్-బి అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. అడ్డంగా పడిన నాలుగు భారీ బోట్లను ముక్కలుగా కత్తిరించి తొలగించాలని నిర్ణయించారు. దీనికోసం విశాఖ నుంచి అనుభవమున్న డైవింగ్ టీమ్లను రప్పిస్తున్నారు. ఈ టీమ్ నది లోపల నీటిలోకి వెళ్లి భారీ కట్టర్లతో బోట్లను ముక్కలుగా కోయనున్నారు. ఇవాళ ఉదయం ప్రకాశం బ్యారేజీకి చేరుకుని డైవింగ్ టీమ్లు పని ప్రారంభించనున్నాయి. బోట్లను ముక్కలు చేశాక పరిస్థితిని బట్టి వాటిని ప్రవాహం ద్వారా దిగువకు పంపడం, లేదా క్రేన్ల సాయంతో పైకిలాగి బ్యారేజీ నుంచి దూరంగా తరలించడం చేస్తామని ఇంజినీర్లు తెలిపారు. బ్యారేజీలోని 67, 68, 69 గేట్ల వద్ద నాలుగు భారీ పడవలు చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 1న ఎగువ నుంచి వచ్చి బ్యారేజీ కౌంటర్ వెయిట్లను బోట్లు ఢీకొన్నాయి.
జగన్ది దేశద్రోహమే
వైసీపీ అధినేత జగన్పై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఘాటు విమర్శలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులపైనే కేసులు పెట్టిన ఘనత జగన్కే దక్కిందని విమర్శించారు. ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేసేందుకు పక్కా ప్లాన్ వేశారని.. ఇది దేశ ద్రోహమే అని అన్నారు. ఆ బోట్లు బ్యారేజీ గేట్లను మరింత బలంగా ఢీకొని ఉంటే దివిసీమ ఉప్పెన కంటే పెద్ద ప్రమాదం సంభవించి ఉండేదన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com